ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ, ఈడీ రంగంలోకి.. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సంచలనలేఖ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన సంజయ్, ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణ కోరుతున్నాం
భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు.ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తుసంస్థల విశ్వసనీయత పెరిగేదని, ఆ పని చేయకపోవడంవల్లే సీబీఐ విచారణ కోరుతున్నాం అన్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరం అని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాశారని నిప్పులు చెరిగారు.

ఫోన్ ట్యాపింగ్ తో చేసిన దారుణాలపై బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు తమ అవసరాలను తీర్చుకున్నారని ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేకంగా పరికరాలు తెప్పించారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావును ఎందుకు రప్పించలేదు
బీఆర్ఎస్ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన సమాచార డేటాను కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సంస్థలు ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నా ఎందుకు స్వదేశానికి రప్పించలేకపోయారో చెప్పాలని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం కోరుతూ లేఖ రాయాలి
ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తుసంస్థలు జోక్యం అనివార్యం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని తన లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. అంతేకాదుతెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉన్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్ కు లేఖ రాయండి అని పేర్కొన్నారు.
కేసీఆర్, కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారించండి
రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్ ను, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications