కేసీఆర్ జాతకం బాగోలేనట్లుంది, అందుకే ఇలా: బండి సంజయ్, 317జీవోపై వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతోపాటు ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీకి బండి సంజయ్ కృతజ్ఞతలు
కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ప్రథమస్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్. మనదేశంలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఆ స్థాయిలో లేనప్పటికీ కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ పెడితే ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు. అదే సమయంలో లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దని కేంద్రం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు బండి సంజయ్ తెలిపారు.
317జీవోపై కేసీఆర్ సర్కారుకు బండి సంజయ్ హెచ్చరిక
317 జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ సర్కార్ 317 జీఓను సవరించే వరకు పోరాటం ఆగదీలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 317 జీవోపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. . ఉద్యోగులకు అండగా బీజేపీ ఉంది. మేము మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్. ఉద్యోగ సంఘాలతో చర్చలు త్వరలోనే జరుపుతామన్నారు. ఉద్యోగులను వారి కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. 9 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317 జీఓపై చర్చించకపోవడం దుర్మార్గమని బండి సంజయ్ మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని బండి సంజయ్ హెచ్చరించారు.
Recommended Video
కేసీఆర్ జాతకం బాగోలేదు.. డౌన్ ఫాల్ స్టార్ట్: బండి సంజయ్
టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే కేసీఆర్ జాతకం బాగాలేదని అర్థమవుతోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బీజేపీ అండగా ఉంటుందని, టీచర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు బీజేపీ వ్యతిరేకం కాదన్న బండి సంజయ్.. మౌలిక వసతులు కల్పించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొత్త డ్రామాలు ఆడుతున్న కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోడీ ఏర్పాటు చేసిన సీఎంల సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందన్నారు బండి సంజయ్.