ఫాంహౌస్కే పరిమితమైన కేసీఆర్.. ఉద్యోగులను గోస పెడుతున్నారు: బండి సంజయ్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల్లో తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్లో ఉన్న కేసీఆర్కు మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలి అనుకుంటున్నాని బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ అనాలోచిత, అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగస్తుల గోస
సీఎం కేసీఆర్ అనాలోచిత.. అర్థరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 317 అమలును నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏక్ నిరంజన్లా నిర్ణయాలు తీసుకుంటూ తుగ్లక్లా వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. రాష్ట్రపతి ఇచ్చిన జీఓను 36 నెలల లోపు పూర్తి చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగులపై నిర్లక్ష్యం వహించారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్కు ఉద్యోగస్తుల గోస తగులుతుందన్నారు.

ఉద్యోగస్తుల్లో గందరగోళం సృష్టిస్తున్న కేసీఆర్..
కేసీఆర్ తన దుర్మార్గమైన ఆలోచనలతో ఉద్యోగస్తుల్లో గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు బండి సంజయ్. బదిలీలు కూడా వెంటనే చేసి జాయిన్ కావాలని ఆదేశించడం వల్ల వారి కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు. స్థానికత ఆధారంగా 90 శాతం ఉండాలని చెప్పారు, కానీ ఎలా చేశారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగస్తుల సమస్యల పై స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ వారి పక్షాన ఆందోళనలు చేపడుతుందన్నారు బండి సంజయ్.

సమస్యలు పక్కదారి పట్టించేందుకే వరి ధాన్యం ముచ్చట
రాష్ట్రంలో 370 యాక్ట్ వచ్చినట్లు ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతను పక్కదారి పట్టించడానికే.. కేసీఆర్ వరి ధాన్యం ముచ్చట తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో ఒప్పందం కుదర్చుకుని, బలవంతంగా ఒప్పించారని ఆరోపణలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారో వారికే తెలియదన్నారు. కేసీఆర్కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుందని బండి సంజయ్ విమర్శించారు.

ఉద్యోగుల కోసం బీజేపీ ఉద్యమమంటూ బండి సంజయ్
ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే ట్రాన్స్ ఫర్లు చేయమని కోరుతున్నామని బండి సంజయ్ చెప్పారు. 36 నెలలలోగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాల్సి ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదని బండి సంజయ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు చర్చించకుండా, ఉద్యోగులు, టీచర్ల అభిప్రాయాలు తీసుకోకుండా వారితో పాటు వారి కుటుంబసభ్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. బదిలీలపై శాస్త్రీయ అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని.. లేనిపక్షంలో సీఎం స్పందించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications