కేసీఆర్ అబద్ధాలకు ఆస్కార్ వచ్చేదే, ఈటల గెలుపుపై నో డౌట్: బండి సంజయ్, రఘునందన్
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

కేసీఆర్ అబద్ధాలకు ఆస్కార్ వచ్చేదే: బండి సంజయ్
రెండు నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు హుజూరాబాద్లో ముఖం చెల్లక ఎన్నికల సంఘంపై నిందలు వేస్తున్నరాని, భారత ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి పేరుందని, సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కేసీఆర్ సర్వేల్లోనూ బీజేపీ గెలుపు ఖాయమనే..: బండి సంజయ్
పశ్చిమబెంగాల్ ఎలక్షన్లో ఈసీ రూల్తో ప్రధానమంత్రి మీటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయని, ఆ రూల్స్ వల్ల అమిత్ షా మీటింగ్ కూడా రద్దు చేసుకున్నామని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి ఉంది.. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖలు రాసింది కేసీఆర్ ప్రభుత్వమేనని బండి సంజయ్ చెప్పారు. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేస్తున్నాడనిన్నారు. దళిత సీఎం ఏమైంది? ఉప ముఖ్యమంత్రి ఏమైంది? మూడెకరాల భూమి ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు బండి సంజయ్. దళిత బంధుపై హుజూరాబాద్ నుంచే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నామని, కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ఖాయమై పోయిందన్నారు.

కేసీఆర్కు ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తం..: బండి సంజయ్
ఓటుకు రూ.20 వేల పంచేందుకు కంటైనర్లలో డబ్బుల కట్టలు తీసుకొచ్చారట. టీఆర్ఎస్ నేతలే ఓటుకు 15 వేలు కట్ చేసుకుని రూ.5 వేలే ఇస్తున్నరట. అవి కూడా దొంగ నోట్లు ఇస్తరేమో జాగ్రత్త అంటూ బండి సంజయ్ ప్రజలనుద్దేశించి చెప్పారు. టీఆర్ఎస్కు ఓటేయాలంటూ పోలీసులతో బెదిరించి భయపెడుతున్నరని మండిపడ్డారు. ప్రజలెవరూ భయపడకండి. స్వేచ్ఛగా ఓటేయండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి. వచ్చేనెల(నవంబర్) 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు 'ట్రిపుల్ ఆర్' సినిమా చూపిస్తం. వచ్చేనెల 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్ ఏం త్యాగం చేశారు?: బండి సంజయ్
కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజలు గళ్లాపట్టి అడగాలన్నారు బండి సంజయ్. ఆగస్టు 16న దళిత బంధు ప్రారంభించారని.. ఇప్పటి వరకు దళితబంధు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే దళితబంధు డబ్బులు అకౌంట్లలో ఎందుకు ఫ్రీజ్ చేశారన్నారు. కేసీఆర్ మొహం చూడటానికి ఎవరూ ఇష్టపడటం లేదన్నారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాలేదని..1400 మంది త్యాగాల వల్ల వచ్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశాడని ప్రశ్నించారు. 3 లక్షల డబుల్ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని.. రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారని బండి సంజయ్ నిలదీశారు.
Recommended Video

ఈటల గెలుపు.. కేసీఆర్కు లైఫ్ టైమ్ మెమోరీనే: రఘునందన్
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాదీ జమ్మికుంటలో బీజేపీవైఎం ఆధ్వర్యంలో జరిగిన యువ సమ్మెళనంలో మాట్లాడారు. 30న జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో ఇంటిలిజెన్స్ అంచనాలు తలకిందులు చేస్తూ.. ఈటల భారీ మెజారిటీతో గెలవబోతున్నారన్నారు. మరో రెండ్రోజులు ఈటలను కాపాడుకుంటే.. చరిత్ర సృష్టిస్తారన్నారు. ఈటల గెలుపు కేసీఆర్కి లైఫ్ టైం గుర్తుండాలన్నారు. ఏప్రిల్ 27న పెట్టాల్సిన ప్లీనరీ ఇప్పుడు పెట్టారంటేనే ఈటల గెలుపుని అంగీకరించినట్లు అని రఘునందన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications