ఉపాధ్యాయ బదిలీల మతలబు ఇదే; కేసీఆర్ జిమ్మిక్కులు తెలుసన్న బండి సంజయ్
ఇందిరాపార్క్ వద్ద ఈనెల 30న బిజెపి చేపట్టబోయే ధర్నాకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లతోపాటు స్పౌజ్ బదిలీలకు అనుమతించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 5 ను జారీ చేసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు, పదోన్నతులు మాన్యువల్ గా జరగనున్నాయి. ఇదే క్రమంలో స్పౌజ్ బదిలీలు కూడా కొనసాగనున్నాయి. అయితే చాలా కాలంగా పరిష్కారం కాని టీచర్ల సమస్య తాజా ప్రభుత్వ నిర్ణయంతో పరిష్కారం కానుంది.
టీచర్ల సమస్యపై బీజేపీ పోరుబాట
చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలలో భార్యకు ఒకచోట భర్తకు మరోచోట బదిలీలు చేయడంతో, ఇద్దరినీ ఒకే చోటకు మార్చాలని ఆందోళన బాట పట్టారు. ఇటీవల కాలంలో ప్రగతి భవన్ ముట్టడించడానికి ప్రయత్నం చేసిన టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా సరే బిడ్డలతోనూ తల్లులు ఆందోళన చేసి భార్యాభర్తలకు ఒకే చోట బదిలీలు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక టీచర్ల సమస్యలు పరిష్కారం కోసం ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 30వ తేదీన బిజెపి ధర్నాకు కూడా రెడీ అయింది.
ఈనెల 30న బిజెపి చేపట్టబోయే ధర్నాకు భయపడే: బండి సంజయ్
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీ విషయంలో నిర్ణయం తీసుకొని జీవో నెంబర్ 5 ను జారీ చేయడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ప్రభుత్వం హడావిడిగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏమిటో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరాపార్క్ వద్ద ఈనెల 30న బిజెపి చేపట్టబోయే ధర్నాకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లతోపాటు స్పౌజ్ బదిలీలకు అనుమతించిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
కేసీఆర్ కు టీచర్లపై ఏమాత్రం ప్రేమ లేదు: బండి సంజయ్
ఇది ఉపాద్యాయులు, బిజెపి కార్యకర్తల పోరాట విజయం అని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల కోసం బీజేపీ ఎంత దూరమైనా వెళుతుంది అనా ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి కేసీఆర్ కు టీచర్లపై ఏమాత్రం ప్రేమ లేదని పేర్కొన్న బండి సంజయ్, నిజంగా ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రేమ, చిత్తశుద్ది ఉంటే కొత్త పీఆర్సీని అమలు చేసే వారు, 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేసేవారు, ప్రత నెలా ఠంచన్ గా ఒకటో తేదీనే జీతాలు విడుదల చేసేవారు అంటూ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
బదిలీలకు ప్రభుత్వ జీవో.. కేసీఆర్ ఆ జిమ్మిక్కులో భాగమే
ప్రస్తుతం టీచర్ల బదిలీలకు ప్రభుత్వం జీవో జారీ చేయడం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికలు వస్తుండటంతో, ఓట్ల కోసం కేసీఆర్ చేసిన జిమ్మిక్కులో భాగమే తప్ప, ఉపాధ్యాయులపై ప్రేమ లేదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన విషయంలో బిజెపి వారికి పూర్తి అండగా నిలుస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూనే ఉంటాము అని బండి సంజయ్ స్పష్టం చేశారు.