ప్రగతి భవన్ కూల్చి .. లక్ష నాగళ్లతో కేసీఆర్ ఫామ్ హౌస్ దున్ని బడుగులకు పంచుతాం ; బండి సంజయ్ ధ్వజం
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పించారు. బిజెపి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ సభ నిర్వహించిన బిజెపి నాయకులు దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనుల పోడు భూములకు పట్టాలు, బిసి సబ్ ప్లాన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై విరుచుకుపడిన బండి సంజయ్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి కెసిఆర్ మోసం చేశారని ధ్వజమెత్తారు.

ప్రగతి భవన్ ను కూల్చి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను కూల్చి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. 2023 తరువాత లక్ష నాగళ్ళతో కెసిఆర్ ఫామ్ హౌస్ ను దున్ని బడుగులకు పంచుతామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక విషయంలో నిప్పులు చెరుగుతున్న బండి సంజయ్ హుజురాబాద్ లో జరిగేది బై పోల్ కాదని, బైయింగ్ పోల్ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

హుజురాబాద్ లో బీజేపీ గెలుపు కేసీఆర్ ఆపలేరు
ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కావాలని ఈటల బావమరిది పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈటెల బావమరిది చాటింగ్ పై విచారణ జరిపించాలని సవాల్ చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్.

కేసీఆర్ పై తెలంగాణా సమాజానికి విశ్వాసం లేదు
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసిల అభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదని విమర్శలు గుప్పించారు. కెసిఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బిజేపి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఫారెస్ట్ అధికారులను పంపి పోడు భూముల్లో ఉన్న పంటలను నాశనం చేయిస్తున్నారని, పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బడుగులు నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బిజెపి సిద్ధమవుతుందని చెప్పిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను రానున్న ఎన్నికల్లో గద్దె దించడమే బిజెపి లక్ష్యమన్నారు.

ప్రజల్లో కేసీఆర్ పై విముఖత
ఇప్పటికే ప్రజలు కెసిఆర్ పై తీవ్ర విముఖతతో ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో కెసిఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది మాత్రం ఈటల రాజేందర్ నే అని గట్టిగా చెప్పారు.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసి బీజేపీ సమారా శంఖం పూరిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు .












Click it and Unblock the Notifications