జనవరిలోగా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకుంటే జరిగేదిదే.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ అల్టిమేటం
తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, యువత ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష నిర్వహించారు. నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిజెపి దీక్షను భగ్నం చేయడానికి పార్టీ ముఖ్య నాయకులను, కార్యకర్తలను గృహనిర్బంధం చేశారని, బిజెపి దీక్ష చేస్తుంది అంటేనే కెసిఆర్ కు వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ దీక్ష చేస్తుంటే కేసీఆర్ కు భయం
రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జివో ఇచ్చారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ కు కోవిడ్ గుర్తు రాలేదని, దీక్షకు వేలాది మంది తరలి వస్తున్నారని తెలియడంతో కెసిఆర్ కి కోవిడ్ గుర్తొచ్చింది అని ఎద్దేవా చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో మరణించినా ఏనాడూ సీఎం బయటకు రాలేదని ధ్వజ మెత్తారు. నిరుద్యోగ దీక్ష ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తుందని భయపడి జీవో తీసుకొచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుంది
నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్ష అనేక ఆటంకాల మధ్య ముగిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ఓవైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఉంటే మరోవైపు ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం తొలగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడేళ్లుగా గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్ లు ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ విధానాలతో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది యువత బలిదానాలు చేసుకున్నారని, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు.

కేసీఆర్ లాంటి మూర్ఖుడి మాటలు నమ్మి మేధావులు మోసపోయారు
ఉద్యోగాలు రాని తెలంగాణ దేని కోసమని ఒక్కసారి ఆలోచించుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు కేసీఆర్ లాంటి మూర్ఖుడి మాటలను నమ్మి ప్రజలే కాదు మేధావులు కూడా మోసపోయారని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంతో మంది యువత ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్న బండి సంజయ్, సుమన్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి దేనికోసం అంటూ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ లో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న బండి సంజయ్ సమగ్ర కుటుంబ సర్వే లో ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు లెక్క చెప్పారని, అయినా వారికి అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణా వచ్చిన తర్వాత 600మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు
ఉద్యోగం కోసమే కదా సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకుంది అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 600 మంది యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్లు చేసిన పాపం ఏంటో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మాత్రం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటనలు ఇచ్చి ఆ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను నిరీక్షించేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లుగా గ్రూప్ 1, డీఎస్సీ నోటిఫికేషన్ లో ఇవ్వకుండా, రాష్ట్రంలో 12 వేల మంది విద్యా వాలంటీర్లను, 7 వేలకు పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను, 600 మందికి పైగా మిషన్ భగీరథ కార్మికులను తొలగించారని పేర్కొన్నారు.

కేసీఆర్ కు బండి సంజయ్ అల్టిమేటం
జనవరి లోపు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే సీఎం కేసీఆర్ నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు సభలో అడుగడుగునా ప్రభుత్వాన్ని అడ్డుకుని తీరుతారు అని తేల్చి చెప్పారు. బయట తమ పార్టీ శ్రేణుల ఆందోళన, అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేల ఆందోళనతో సభను స్తంభింపజేస్తాం అని అల్టిమేటం జారీ చేశారు. తెగించి కొట్లాడతాం అని తేల్చి చెప్పారు. నిరుద్యోగులు ఎవరూ ఆవేశపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని బండి సంజయ్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలన్నారు బండి సంజయ్.

టీఆర్ ఎస్ ను తరిమికొట్టటానికి తెలంగాణా రాష్ట్రంలో చివరి ఉద్యమం
తెలంగాణ రాష్ట్రంలో ఇదే చివరి ఉద్యమం కావాలని, ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు కోసం సాగిన ఉద్యమానికి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ అని, అప్పుడు కెసిఆర్ ఎక్కడికి పోయాడో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంటులో ఓటు వేయకుండా సోయి తప్పిన వ్యక్తి కెసిఆర్ అని, కానీ నాడు సభలో విజయశాంతి సింహ గర్జన చేశారని గుర్తు చేశారు.

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులు
ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడిన బండి సంజయ్ దొంగ దీక్ష చేసే లక్షణం నీ అయ్యకు ఉందని ఘాటుగా విమర్శించారు. బాత్ రూం లోకి పోయి ఇడ్లీలు తిన్న నీచపు బతుకు నీ అయ్యది అంటూ ద్వజమెత్తారు. తెలంగాణ గంగలో పడినా నాకు అక్కరలేదు, నేను బతుకుతాను, జ్యూస్ ఇవ్వమని తాగిన నీ అయ్య చేసింది దొంగ దీక్ష అని నిప్పులు చెరిగారు. ఢిల్లీలో 48 గంటల దీక్ష చేస్తానని చెప్పి 10 గంటలు కూడా చేయకుండా పోయి తాగి పడుకున్న చరిత్ర నీదని ఘాటుగా వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే గుండె మీద ప్రమాణం చేసి 48 గంటల దీక్ష చేశానని చెప్పగలవా అంటూ కేటీఆర్ ను టార్గెట్ చేశారు.

ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయ్? భయం దేనికి?
అంతేకాదు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేసిన బండి సంజయ్ సీఎం దగ్గర మటన్, చికెన్ బిర్యానీలు తిన్న ఉద్యోగ సంఘాలు ఏమైపోయాయో చెప్పాలని గర్జించారు. తాజా పరిస్థితులపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఉద్యోగుల పరిస్థితి ఏంటని, భార్య ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర, తల్లిదండ్రులు మరోచోట ఉన్నారని పేర్కొన్న బండి సంజయ్ ఉద్యోగులు ఏడుస్తుంటే ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ ను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని, అలాంటిది మీరు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానికత కోసం ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల స్థానికత ప్రశ్నార్థకమైంది అని భావితరాల భవిష్యత్, వారి స్థానికత నేడు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు తాను చేపట్టిన నిరుద్యోగ దీక్షకు సంఘీభావం ప్రకటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆయన ఓయు విద్యార్థులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications