లైఫ్ ఆగంచేశారు, చంద్రబాబుపై నమ్మకం పోయింది: శోభారాణి కంటతడి, నాకేం కొత్తకాదని వార్నింగ్
Recommended Video
ఆలేరు/హైదరాబాద్: ఆలేరు నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు బండ్రు శోభారాణి అధిష్టానంపై, కూటమిపై శుక్రవారం నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టాలంటే నేను కావాలి కానీ, టిక్కెట్ ఇచ్చేటప్పుడు అక్కరలేదా అని నిలదీశారు. లైఫ్ ఆగం చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
మోత్కుపల్లి ఆగంచేశారు, మీ శిష్యురాలిగానే బతుకుతా: ఒక్క ఛాన్స్ అంటూ శోభారాణి కంటతడి
పార్టీ తరఫున ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపించామని, నాడు చీప్ లిక్కర్కు వ్యతిరేకంగా ఉద్యమించి, కేసీఆర్కు చుక్కలు చూపించామని చెప్పారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రిని జిల్లా చేయాలని ఉద్యమం చేసి సాధించామన్నారు. పార్టీ తరఫున చేసే పోరాటంలో తన పేరు అంతటా వినిపించేదన్నారు.
ఈ రోజుతో చంద్రబాబుపై నమ్మకం పోయింది
మీడియాలో కేసీఆర్కు, తెరాసకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే నేను కావాలి కానీ టిక్కెట్ ఇవ్వరా అని శోభారాణి వాపోయారు. చంద్రబాబుపై నమ్మకంతో తాను పార్టీ కోసం పని చేశానని, ఈ రోజుతో నమ్మకం పోయిందని చెప్పారు. కొత్త వ్యక్తులకు పోటీ చేసే అవకాశమిస్తన్నారని, తనకు మాత్రం ముఖం చాటేస్తున్నారని వాపోయారు. తెలంగాణలో లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారని, తమ పార్టీకి టిక్కెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పంచుకుందని ఆరోపించారు. పార్టీ కోసం పని చేసిన తమలాంటి వాళ్ల పరిస్థితి ఏమిటన్నారు.
మాలాంటి వారికి అవకాశమివ్వాలి
ఉద్యమం సమయంలో గుర్తుకు వచ్చే తాము, టిక్కెట్ల సమయంలో ఎందుకు గుర్తుకు రావడం లేదని శోభారాణి ప్రశ్నించారు. డబ్బులు ఉన్న వాళ్లు చివరి నిమిషంలో టికెట్లు తీసుకుంటున్నారని చెప్పారు. డబ్బు ప్రధానం అనుకుంటే తమ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలు ప్రజల కోసం పని చేయాలన్నారు. కార్పోరేట్ ఆఫీసులు కాదని చెప్పారు. ప్రజల గొంతు వినిపించే తమలాంటి వాళ్లకు అవకాశమివ్వాలన్నారు.
చంద్రబాబుకు మేం ఎందుకు కనిపించలేదో
పార్టీ కోసం తాను పదిహేనేళ్ల పాటు పని చేశానని శోభారాణి చెప్పారు. కానీ ఫలితం దక్కకుండా పోయిందని కన్నీరుమున్నీరు అయ్యారు. తన జీవితాన్ని కోల్పోయానని అన్నారు. పార్టీ వైపు ఎందరో కన్నెత్తి చూడని పరిస్థితుల్లో తాము కాపలా కుక్కలా పని చేశామని చెప్పారు. చంద్రబాబుకు, రాష్ట్ర నాయకత్వానికి తాము ఎందుకు కనిపించడం లేదో అర్థం కావట్లేదన్నారు.
తెరాసలో ఎదురైన చేదు ఇక్కడా ఎదురైంది
తమ జీవితం అంతా పార్టీకే ధారపోశామని, ఇక్కడే తమ జీవితం అయిపోయిందని, కుటుంబాలు నాశనం అయ్యాయని, ఆస్తులు అమ్ముకున్నామని, ఇబ్బందులు పడ్డామని చెప్పారు. కుటుంబాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడితే ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. 2004లో తనకు తెరాసలో టిక్కెట్ రాలేదని, అప్పుడు చంద్రబాబు పిలుపుతో టీడీపీలో చేరానని, కానీ ఇక్కడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని అనుకోలేదన్నారు. టిక్కెట్ తనకు వస్తుందని ఇటీవలి వరకు చెప్పారని, చివరకు అన్యాయం చేశారన్నారు.
పిల్లల్ని చదివించేందుకు చందాలు తీసుకున్నానని చెప్పా
తాను తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పని చేశానని, ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని, యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా పని చేస్తున్నానని, అయిదేళ్లుగా నియోజకవర్గ ఇంచార్జిగా ఉంటూ డబ్బు ఖర్చు చేశానని శోభారాణి చెప్పారు. చంద్రబాబుకు పలుమార్లు తన ఆవేదన చెప్పుకున్నానని, భూమి, గాజులు, ఇల్లు అమ్మేశానని, తన పిల్లలను చందాలు అడుక్కొని చదివించుకున్నానని చంద్రబాబుకు చెప్పానని, ఇంత అన్యాయం జరిగాక ఇక బతకడం ఎందుకని ఆమె అన్నారు.
ఎదురు తిరగడం నాకు కొత్త కాదు
రాజకీయ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరనప్పుడు ఇక ఎందుకని శోభారాణి అన్నారు. తనకు ఏం చేయాలో తోచడం లేదన్నారు. ఇక్కడి క్యాడర్ తనను పోటీ చేయమని చెబుతోందని, కానీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాలా లేక వేచి చూడాలా అర్థం కావడం లేదని చెప్పారు. పోరాటం, ఎదురు తిరగడం తనకు కొత్త కాదని, ఇంకా అధిష్ఠానం పిలుపు కోసం, మాట కోసం ఎదురు చూస్తున్నానని, అయినా వారు తగ్గకుంటే నా నిర్ణయం నేను తీసుకుంటానని చెప్పారు.