ప్రేమ+స్నేహం=సంగీతం: సినిమా ఛాన్స్ పేరిట యువత నుంచి లక్షల వసూలు
హైదరాబాద్: కొత్త సినిమా తీస్తున్నామంటూ ప్రకటనలు గుప్పించి అమాయకులైన యువత నుంచి లక్షలు వసూలు చేసిన ఓం సాయిరాం ప్రొడక్షన్స్ సంస్ధతో పాటు దాని యజమాని రాజేంద్ర నాయక్పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే....
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన రాజేంద్ర అలియాస్ డీవీ సిద్ధార్థ్, ఫిలింనగర్లోని అపోలో ఆసుపత్రి రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పేరిట ఓ కార్యాలయాన్ని తెరిచి 'ప్రేమ + స్నేహం = సంగీతం' అనే సినిమాను జూన్ 19 నుంచి సినిమాను ప్రారంభిస్తున్నామని, హీరోలు కావాలంటూ పేపర్, టీవీల్లో ప్రకటనలు ఇచ్చాడు.
ఈ ప్రకటన చూసిన మేడ్చల్ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ గౌడ్ సినిమాలపై ఆసక్తి ఉండటంతో సోదరి వివాహం కోసం తన ఇంట్లో దాచి ఉంచిన రూ. 4 లక్షలను తల్లిదండ్రులకు తెలియకుండా దొంగ చాటుగా తీసుకొచ్చి సిద్ధార్థకు ఇచ్చాడు.
తనతో పాటు అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్, కిషోర్లు కూడా తలో లక్ష రూపాయలు యజమాని సిద్ధార్థకు అందజేశారు. వీరితో పాటు పలువురి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. అమాయుకులైన యువకుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులకు బాండ్ రాసిచ్చాడు.
తీరా సినిమా ప్రారంభం కావాల్సిన రోజున మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఆంతేకాదు కార్యాలయాన్ని సైతం ఎత్తేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి కూర్చున్నాడు. దీంతో తామంతా మోసపోయామని భావించిన బాధితులు, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.