ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయిన బర్రెలక్క మళ్లీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు .
ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క
తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బర్రెలక్క అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం పైన నిరసన వ్యక్తం చేస్తూ ఎన్నికల బరిలోకి దిగారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు ఊహించని మద్దతు
ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్నికల ప్రచారంలో బర్రెలక్క దూసుకుపోయారు. అప్పట్లో బర్రెలక్క పోటీ చేయడాన్ని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, రాంగోపాల్ వర్మ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి వారు మద్దతు తెలిపారు. ఇక విదేశాలలో ఉన్న తెలుగువారి నుంచి కూడా బర్రెలకు మద్దతు దొరికింది. అయితే అప్పుడు ఎన్నికల్లో బర్రెలక్కకు 5598 ఓట్లు పోలయ్యాయి.
నిరుద్యోగ సమస్య కోసం మళ్ళీ ఎంపీ పోటీలో
ఆ తర్వాత మళ్లీ నిరుద్యోగుల తరుపున పోరాటం ఆపేదిలేదని పేర్కొన్న బర్రెలక్క ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కూడా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే గత ఎన్నికల సమయంలో ఉన్న క్రేజ్ ఈసారి బర్రెలక్కకు ఉంటుందా? ప్రజల నుంచి అంతే స్థాయిలో బర్రెలక్కకు మద్దతు దొరుకుతుందా? గత ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ఎంతో మంది ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈసారి బర్రెలక్క క్రేజ్ తగ్గుతుందా?
మరి ఈసారి బర్రెలక్కకు ఆర్థిక సహాయం ప్రజల నుంచి అందుతుందా? అంటే చెప్పలేమనే అభిప్రాయమే వ్యక్తమౌతుంది. ఏది ఏమైనా ఈసారి ఎన్నికల్లో కూడా బర్రెలక్క బరిలోకి దిగడం నాగర్ కర్నూల్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పుడు కూడా ఆమె హవా కొనసాగుతుందా .. లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications