ఆ జిల్లా మహిళలకు బతుకమ్మ చీరలు లేనట్టే ... ఎందుకంటే
బతుకమ్మ పండుగ చీరల పంపిణీ ఒక సంబరంలా జరగనుంది. .తెలంగాణ సాంస్కృతిక సంబరానికి ఊరువాడ ముస్తాబవుతోన్న తరుణంలో తెలంగాణా ఆడపడుచులకు కానుకగా ప్రభుత్వం ఇవ్వాలనుకున్న బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుండి ప్రతి జిల్లాలో జరగనుంది. అయితే ఈ చీరల పంపిణీ ఒక్క సూర్యాపేట జిల్లాలో చెయ్యకపోవటం సూర్యాపేట జిల్లా మహిళలను నిరాశకు గురి చేస్తుంది. పండుగ పూట ప్రభుత్వ కానుక అందుకోలేకపోతున్నామని అక్కడ మహిళలు తెగ బాధ పడుతున్నారు. మరి అసలు సర్కార్ అక్కడ మహిళలకు చీరల పంపిణీ చెయ్యకపోవటానికి కారణం ఏమిటి అంటే..

బతుకమ్మ కానుక వస్తుందని ఆశపడిన సూర్యాపేట మహిళలు
తెలంగాణ ఆడపడుచుల అందరికీ ప్రతియేటా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు బృహత్తర కార్యక్రమం చేపట్టిన తెలంగాణ సర్కార్ ఏ ఒక్కరికీ తగ్గకుండా ఉండేలా చీరల తయారీ చేయించింది. ఈ ఏడాది కూడా నేత కార్మికులకు ఉపాధి కల్పించి అందమైన బతుకమ్మ చీరలను నేయించి తెలంగాణా ఆడపడుచులకు కానుకగా ఇవ్వనుంది. 1.02 కోట్ల మహిళలకు ఈ బతుకమ్మ చీరలను అందించనున్నామని చెప్పిన ప్రభుత్వం వంద రకాల చీరలు నేయించింది.10 రకాల రంగులలో పది రకాల డిజైన్లలో చీరలను చాలా అందంగా నేయించామని రంగు రంగుల సీతాకోక చిలకల్లా ప్రభుత్వం అందించిన చీరలను ధరించి పండుగ జరుపుకోవాలని చెప్తే సూర్యాపేట జిల్లాలోని మహిళలు సైతం తమకు బతుకమ్మ చీరలు వస్తాయని ఆశపడ్డారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక నేపధ్యంలో సూర్యాపేట జిల్లాలో నో చీరల పంపిణీ
కానీ హుజూర్ నగర్ ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో సూర్యాపేట జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి విఘాతం ఏర్పడింది. దీంతో అక్కడి మహిళలు చీరలు తమ జిల్లాలో ఇవ్వటం లేదని , ఎన్నిక కోడ్ సందర్భంగా చీరల పంపిణీ సాధ్యం కాదని తెలియటంతో ఉసూరుమంటున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉన్న సూర్యాపేట జిల్లా మినహాయించి తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో బతుకమ్మ చీరల్ని పంపిణీ చేయనున్నారు జిల్లా యంత్రాంగం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో చీరల పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితం అవుతారు కాబట్టి అలాంటివి ఎలెక్షన్ కోడ్ సమయంలో అమలు చెయ్యటానికి వీలు లేదు.

ఎన్నికల కోడ్ ముగిశాక చీరల పంపిణీ చేస్తామన్న అధికారులు
అసలు మహిళలు అత్యంత ఇష్టమైనవిగా భావించేది చీరలు. అలాంటి పండుగ చీరలు ప్రభుత్వం నేయించి ఇస్తే తీసుకోలేకపోవటం అక్కడ మహిళలకు పండుగ సంతోషం లేకుండా చేస్తుంది . దీనికి ఎన్నికల కోడ్ కారణం కావటం కాస్తంత నిరుత్సాహాన్ని కలిగిస్తుంది .అయితే సూర్యాపేట జిల్లా మహిళలు ఎవరూ నిరాశ పడొద్దని కోడ్ ముగిసిన తర్వాత చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మొత్తానికి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలు అందరికీ, 18 సంవత్సరాలు పైబడిన యువతులకు సైతం చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఆ జిల్లా మహిళలను పండుగ పూట నిరాశకు గురి చేసింది.












Click it and Unblock the Notifications