విఎన్ఆర్ కాలేజ్, బియాస్ నది ట్రాజెడీ: వడ్డీ సహా రూ.20లక్షల పరిహారం ఇవ్వాలని హైకోర్టు
సిమ్లా/హైదరాబాద్: 2014 ఏడాదిలో హైదరాబాద్ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు 24 మంది బియాస్ నదిలో చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు శనివారం నాడు తీర్పు చెప్పింది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహార ఇవ్వాలని ఆదేశించింది.
ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని హైకోర్టు మండిపడింది. బాధితుల కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ఈ పరిహారంలో 60 శాతాన్ని బియాస్ నది ఆనకట్ట బోర్డు చెల్లించాలని ఆదేశించింది.
30 శాతాన్ని కళాశాల యాజమాన్యం, మిగిలిన పది శాతాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. పరిహారంపై 7.5 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.
2014 జూన్ 8న హైదరాబాదులోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు. నాడు మృతి చెందిన వారిలో ఆరుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు.