హైదరాబాదులో బెంగళూర్ విద్యార్థి ఆత్మహత్య: ఇద్దరు భార్యలను పోషించలేక..
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లక్డీకాపూల్లోని ఓ హోటల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. హోటల్ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని బెంగళూరుకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే, వరంగల్ నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతూ నాటు తుపాకీతో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న అజ్మీర నాగరాజు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీసీ సురేందర్నాథ్ చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం - వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన నాగరాజు వృత్తిరీత్యా డ్రైవర్. ఇతడికి ఇద్దరు భార్యలున్నారు.
కుటుంబ పోషణ భారం కావడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాలోచనతో తన మొదటి భార్య సమీప బంధువు ఖమ్మం జిల్లా కొత్తగూడెంమండలం రామవరం గ్రామానికి చెందిన గాజుల శంకర్ అనే వ్యక్తి సహాయంతో శంకర్ తండ్రి పనిచేస్తున్న ధన్బాధ్ సమీపంలోని బోకారో(జార్ఖండ్ రాష్ట్రం)కు చేరుకుని అక్కడ నాటు తుపాకీ కొనుగోలు చేశాడు.
ఆ తుపాకీతో బెదిరించి సులువుగా డబ్బు లు సంపాదించవచ్చుననే ఆలోచనలో ఈ నెల 15న ఎంజీఎం ఆస్పత్రిలో అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న డాక్టర్ కోసం తిరుగుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడని ఏసీపీ వివరించారు.
ఇదే రోజు అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న మట్టెవాడ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకొన్నట్లు ఏసీసీ తెలిపారు. మరో నిందితుడు గాజుల శంకర్ పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మట్టెవాడ సీఐ శివరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయంలో చోరీ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని నాలుగు విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విగ్రహాలు రూ. 2 లక్షల విలువ చేస్తాయని అర్చకులు తెలిపారు. రెండు హుండీలను పగులగొట్టి అందులో ఉన్న కానుకలను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.