కడుపునొప్పి తగ్గిస్తానని చెప్పి-నాటు వైద్యుడి ఘాతుకానికి పసికందు బలి-చిన్న పేగు తెగి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఓ నాటు వైద్యుడు వైద్యం పేరుతో చేసిన ఘాతుకానికి పసికందు బలయ్యాడు. కడుపునొప్పి తగ్గిస్తానని చెప్పి ఆ చిన్నారి బొడ్డు చుట్టూ పళ్లతో కొరికాడు నాటు వైద్యుడు.మరుసటిరోజే ఆ చిన్నారి మృతి చెందాడు. నాటు వైద్యుడు చేసిన పనికి చిన్నారి చిన్న పేగు తెగి మృతి చెందాడు,
వివరాల్లోకి వెళ్తే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ గూడెంకి చెందిన పొడియం దేవయ్య, సంగీత దంపతులకు రెండు నెలల బాబు జన్మించాడు. ఏమైందో ఏమే తెలియదు గానీ సోమవారం(సెప్టెంబర్ 13) రాత్రంతా ఆ బాబు ఏడుస్తూనే ఉన్నాడు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు తమ గూడెంలోని ఓ నాటు వైద్యుడి వద్దకు బాబు తీసుకుని వెళ్లారు. బాబును పరీక్షించిన నాటు వైద్యుడు.. ఆ చిన్నారి కడుపునొప్పితో బాధపడుతున్నాడని చెప్పాడు.
కడుపునొప్పి తగ్గిస్తానని చెప్పి చిన్నారి బొడ్డు చుట్టూ గట్టిగా కొరికాడు. ఆ నొప్పిని తట్టుకోలేక పసికందు మరింత ఏడ్చారు. పసికందు ఏడ్వకుండా ఉండేందుకు పసరు మందు ఇచ్చాడు.ఆ తర్వాత చిన్నారి పరిస్థితి మరింత విషమించింది. విషయం తెలుసుకున్న స్థానిక ఆశావర్కర్ చిన్నారిని కరకగూడెం ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించగా... పొట్టలో చిన్నపేగులు తెగినట్లు గుర్తించారు. చిన్నారి బొడ్డు చుట్టూ కొరికిన గుర్తులు చూసి తల్లిదండ్రులను నిలదీశారు. దీంతో వారు అసలు విషయం చెప్పారు. నాటు వైద్యుడు కొరకడం వల్లే పేగులు తెగిపోయాయని చెప్పారు. ఇంతలో చిన్నారి పరిస్థితి మరింత విషమించి మృతి చెందాడు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నాటువైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాటు వైద్యులను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు :
జబ్బు చేస్తే ఆస్పత్రికి వెళ్లాల్సిందిపోయి నాటు వైద్యుల వద్దకు,మంత్రగాళ్లు,బాబాలు,స్వామిజీల వద్దకు పరిగెత్తే జనం ఇప్పటికీ చాలామందే ఉన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లు... ఇలాంటివారిని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆర్నెళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం హిరాపూర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు పాము కాటేయగా... తల్లిదండ్రులు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్కు తరలించేందుకు సిద్ధమయ్యారు.
కానీ ఇంతలో స్థానికులు కొందరు కలగజేసుకుని... ఆస్పత్రి కంటే నాటు వైద్యమే పాము కాటుకు బాగా పనిచేస్తుందని చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మి నాటు వైద్యుని వద్దకు వెళ్లారు.సదరు నాటు వైద్యుడు చేసిన వైద్యం వికటించడంతో పాము కాటు ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువైంది.ఆమె పరిస్థితి రోజురోజుకు విషమిస్తుండటంతో.. ఇక లాభం లేదనుకుని మళ్లీ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలికకు సరైన వైద్య చికిత్స అందించి ప్రాణాపాయం తప్పించారు. నాటు వైద్యం,మంత్రాలు,తాయిత్తులు వంటివి నమ్మవద్దని ఏజెన్సీ వైద్యాధికారి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్య సమస్య ఉంటే ఆస్పత్రికి వెళ్లాలి తప్ప మూఢనమ్మకాలు వ్యాధులను నయం చేయవని సూచించారు.