భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ - పెరుగుతున్న కేసులు : ప్రభుత్వం నేడు కీలక నిర్ణయాలు..!!
కరోనా థర్డ్ వేవ్ విస్తరిస్తున్న వేళ..తెలంగాణలో కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఆదివారం సైతం రెండు వేలకు సైగా కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సినీ - పొలిటికల్ సెలబ్రెటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తాజాగా చేయించుకున్న టెస్టుల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.
కరోనా బారిన ప్రముఖులు
ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిపై భట్టి విక్రమార్క వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని భట్టి విక్రమార్క కోరారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత తానే బయటకు వస్తానని, అందరినీ కలుస్తానని చెప్పకొచ్చారు.
ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కాగా, తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. మనవరాలి పెళ్లి తరువాత స్పీకర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తిరిగి ఇప్పుడు మరోసారి కరోనా సోకింది.
నేటి కేబినెట్ లో కీలక నిర్ణయాలు
ఇక తెలంగాణలో ఆదివారం కొత్తగా 2,047 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 1, 174 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మంత్రులు జగదీష్ రెడ్డి.. పలువురు ఎమ్మెల్యేలు..ఎంపీలు కరోనా బారిన పడ్డారు. ఇక, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ వరకు సెలవు ప్రకటించింది. ఇదే సమయంలో తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది.
రాత్రి కర్ఫ్యూ అమలు దిశగా
అందులో కరోనా కట్టడి చర్యల దిశగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒమిక్రాన్ కేసులు సైతం వ్యాపిస్తున్న వేళ.. రాత్రి సమయాల్లో నియంత్రణ అవసరమని భావిస్తున్నారు. ఇప్పటికే టీనేజర్లకు వ్యాక్సినేషన్ లోనూ తెలంగాణలో వేగంగా అమలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలోనూ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.