బీజేపీకి భారీ షాక్: రావుల గుడ్ బై -మోదీ-కేసీఆర్కు తేడా ఇదే - దుబ్బాక, గ్రేటటర్ ఎన్నికల వేళ..
మరో 48 గంటల్లో దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుండగా.. తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ విషయంలో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు.
11 ఏళ్ల అనుబంధం..
బీజేపీకి గుడ్ బై చెబుతోన్న సందర్భంగా రావుల ఆదివారం సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘11 ఏళ్ల కిందట.. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరాను. 2018లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేశాను. అయితే ఇటీవల కాలంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల తెలంగాణకు న్యాయం జరుగుతోంది. ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలపై అబద్దాలు చెప్పడం అసలు నచ్చలేదు. ఆత్మవంచన చేసుకోలేకే బీజేపీని వీడుతున్నాను'' అని రావుల వ్యాఖ్యానించారు. అంతేకాదు..
మోదీ-కేసీఆర్కు తేడా ఇదే
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ కేసీఆర్ ద్వారా సాధ్యమైందని, 6 ఏళ్లుగా పురోగమిస్తూ.. దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా కేసీఆర్ నిలబెట్టారని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ, బీజేపీలు దేశాన్ని, రైతాంగాన్ని కార్పొరేట్ మయం చేస్తున్నాని, అదే కేసీఆర్ మాత్రం తెలంగాణను సస్యశామలం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర నిర్ణయాలు తిరోగమన దిశగా ఉన్నాయని, రైతుల విద్యుత్ కనెక్షన్లకు మోటర్లకు మీటర్లు బిగించడం సమంజసం కాదన్నారు.
టీఎర్ఎస్లో చేరిక..
ఆత్మవంచన చేసుకోలేక బీజేపీని వీడానన్న రావుల.. తన అనుచరులతో కలిసి ఆదివారమే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అగ్రగామిగా నిలుస్తోందని, తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, వారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు శ్రీధర్ రెడ్డి చెప్పారు. దుబ్బాక బైపోల్ కు సరిగ్గా రెండు రోజుల ముందు రావుల రాజీనామా చేయడం, బీజేపీ కీలకంగా భావించే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందు పెద్ద నేత పార్టీని వీడటం ఎదురుదెబ్బగా నేతలు భావిస్తున్నారు.