పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు, కండీషన్స్ అప్లై!
కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ ను నిలదీసి దాడికి దిగిన కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన దాడి వ్యవహారంలో అరెస్టు అయిన బి.ఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నేడు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.
పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలుకు వెళ్లకుండానే విడుదలయ్యారు.కరీంనగర్ లో రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు నేడు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని హాజరపరచగా మూడు కేసులలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. గురువారంలోగా రెండు లక్షల రూపాయల పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు.

షరతులతో కూడిన బెయిల్.. విచారణకు రావాలని ఆదేశం
అంతేకాదు పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని కూడా పేర్కొన్నారు. ఇక మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయనని పాడి కౌశిక్ రెడ్డి కోర్టుకు తెలిపారు.
అంతకుముందు కరీంనగర్ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు
పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే
ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇక విడుదలైన తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతి పండుగ రోజు రాజకీయాలు తాను మాట్లాడదలచుకోలేదని తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
కరీంనగర్ లో విలేకరుల సమావేశం pic.twitter.com/XLmXLLb0Oc
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 14, 2025
పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై బీఆర్ఎస్ ఫైర్
కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల పైన ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డి పై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపైన ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్న పరిస్థితులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications