కలకలం: ‘డిఫెన్స్ మినిస్ట్రీ’ వాహనాల్లో వచ్చి రూ.16లక్షల దోపిడీ
కుమ్రంభీం: జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. మారణాయుధాలతో ఓ దొంగల ముఠా రైస్మిల్లు సిబ్బందిని బెదిరించి నగదును దోచుకెళ్లి, అనంతరం పోలీసులకు చిక్కిన ఘటన సోమవారం రాత్రి కుమ్రంభీం జిల్లాలో కలకలం సృష్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్నగర్ మండలం కోసిని గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్మిల్లులో కొంతమంది దుండగులు మారణాయుధాలతో ప్రవేశించారు. సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.16లక్షల నగదును దోచుకెళ్లారు.

దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుండగులను వెంబడించి సిర్పూరు.టిలోని రైల్వేస్టేషన్ వద్ద పట్టుకున్నారు. మహారాష్ట్ర వైపు పోతుండగా అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాగా అనుమానిస్తున్నారు.
దుండగుల్లో కొందరు మిలిటరీ డ్రెస్సుల్లో ఉండటం, వారు వచ్చిన రెండు వాహనాలకు కూడా డిఫెన్స్ మినిస్ట్రీ స్టిక్కర్లు ఉండటం గమనార్హం. కాగా, దుండగులను నుంచి ఇంకా వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఘటనపై జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
భారీ చోరీ
హన్మకొండ కాకాజీ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఓ అపార్ట్మెంట్లో 50తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు దొంగలు.
జడ్చర్లలో దారి దోపిడి
మహబూబ్నగర్: తుపాకితో ఓ వ్యక్తిని బెదిరించి నగదు, కారును దోపిడీ చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన సైకిళ్ల వ్యాపారి రామ్అవతార్ జడ్చర్ల వద్ద రోడ్డుపై కారును ఆపి కిందికి దిగాడు. ఇదే అదునుగా భావించిన దుండగలు తుపాకితో అతన్ని బెదిరించి రూ. 5లక్షల నగదుతో పాటు ఆయన ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారును తమ వెంట తీసుకెళ్లారు. దీంతో రామ్అవతార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications