టీఆర్ఎస్లో అవినీతి 2 రకాలు.. అచ్చు ఆ సినిమాను తలపించేలా.. ఈటల ఎపిసోడ్ కొత్త డ్రామా : బండి సంజయ్
ఓవైపు కరోనాతో ప్రజలు చనిపోతుంటే... మరోవైపు ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమా.. లేక ఈ రాజకీయ క్రీడ ముఖ్యమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ రియల్ ఎస్టేట్ సమితి అని తాము ఏనాడో చెప్పామన్నారు. ఎన్నికల తర్వాత చాలామంది ఆ పార్టీని వీడుతారని చెప్తే చాలామంది ఎగతాళి చేశారు... కానీ ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నారు కదా అంటూ వ్యాఖ్యానించారు.
ఫాంహౌస్లో పడుకుని ఐపీఎల్ చూస్తున్నారా...
సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పడుకుని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నారేమోనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కరోనాపై సమీక్ష జరపని ముఖ్యమంత్రి... ప్రజలకు ఏవిధమైన భరోసా కల్పించని ముఖ్యమంత్రి... వ్యాక్సిన్ వేసుకోమని చెప్పని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. పక్కనే ఉన్న భారత్ బయోటెక్కు ఒక్కనాడైనా వెళ్లారా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్ అవసరమో ఆయనకు అవగాహన ఉందా అని నిలదీశారు.
ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు 18 గంటలు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,విదేశీ అధినేతలతో కరోనాపై సంప్రదింపులు జరుపుతుంటే... కేసీఆర్ మాత్రం ఫాంహౌస్కు పరిమితమయ్యారని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో సీఎం ఉన్నాడా లేడా అన్న అనుమానం ప్రజల్లో నెలకొందన్నారు. ఆరోగ్య శాఖకు కేంద్రం నిధులు ఇస్తున్నందునా దోపిడీ కోసమే కేసీఆర్ ఇప్పుడా శాఖను తీసుకున్నారని ఆరోపించారు.
ఓవైపు పేద ప్రజలు చనిపోతుంటే... ఇదో కొత్త డ్రామా...
రాష్ట్రంలో కరోనా మరణాలపై ప్రతీరోజూ బులెటిన్ విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చే నివేదికకు ప్రభుత్వం ఇచ్చే బులెటిన్కు చాలా తేడా ఉంటోందన్నారు. వాస్తవ మరణాల సంఖ్యను ఎందుకు బయటపెట్టట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుచేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకూ ఎందుకు దాన్ని అమలుచేయలేదని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్తే... ఆ బిల్లులు చూసి గుండెపోటుకు గురవుతున్నారని చెప్పారు. పేద ప్రజలు కరోనాతో చనిపోతుంటే... ఈటలపై భూకబ్జా ఆరోపణలతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.
జులాయి సినిమా తరహాలో... : బండి సంజయ్
దోపిడీ డబ్బును పంచుకునే విషయంలో తలెత్తిన గొడవలే టీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలకు కారణమన్నారు. జులాయి సినిమాలో ముఠా లాగా దోపిడీ డబ్బును పంచుకునే విషయంలో ఒకరినొకరు చంపుకుని చివరకు కేసీఆర్ ఒక్కడే మిగులుతాడని ఎద్దేవా చేశారు. ఈటల భూకబ్జా వ్యవహారం నాలుగేళ్ల క్రితమే తెలిస్తే ఇప్పటివరకూ నిద్రపోయారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన మరునాడే ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఒక్క మంత్రిపై చర్యలు తీసుకున్నంత మాత్రాన కేసీఆర్ ప్రభుత్వం నీతివంతమైనదేమీ కాదని అన్నారు.
Recommended Video
టీఆర్ఎస్లో అవినీతి రెండు రకాలు...
మంత్రి మల్లారెడ్డి సూరారం,జవహర్నగర్లలో చేసిన భూకబ్జాల సంగతేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్లో అవినీతిని రెండు రకాలుగా విభజించారని... అందులో అనుకూల అవినీతి,వ్యతిరేక అవినీతి ఉన్నాయన్నారు. తమకు అనుకూలమైనవాళ్లు అవినీతి చేస్తే ఒక లాగా... వ్యతిరేకులు అవినీతి చేస్తే మరొక లాగా వ్యవహరిస్తారని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్,గొంగిడి సునీత,సైదిరెడ్డి,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుల అవినీతి సంగతేంటని నిలదీశారు. టీఆర్ఎస్లో 77 మంది నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. కేసీఆర్ చేతగాని తనం వల్లే ఇదంతా జరుగుతోందని... కాబట్టి మొదట సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు,ఎమ్మెల్యేలపై వస్తున్న భూకబ్జా ఆరోపణల్లో చివరకు అధికారులే బలవుతారని పేర్కొన్నారు.