టీఆర్ఎస్ మహిళా వ్యతిరేక పార్టీ, పురుషాధిక్యత ప్రదర్శించే పార్టీ: భగ్గుమన్న బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ఇక తాజాగా గవర్నర్ తమిళిసై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు చేసిన ఆరోపణలతో బిజెపి నేతలు మండిపడుతున్నారు.

టీఆర్ఎస్ మహిళా వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తోంది
టీఆర్ఎస్ పార్టీ మహిళా వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తోందని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. ఇటీవలి నిర్మలా సీతారామన్ ఘటన, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల అభ్యంతరకరమైన ప్రవర్తనా తీరు కనబడుతోందని టిఆర్ఎస్ పార్టీ తీరును తప్పు పట్టారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరుగుతుందని రాష్ట్రంలో టెక్నాలజీ డెవలప్మెంట్ తమదే బాధ్యత అని చెబుతున్న మంత్రి కేటీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

టీఆర్ఎస్ లో బాగా ఎదిగిన మహిళా లీడర్లు లేరు.. ఉన్నా కుటుంబంలోని వారే
టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ మహిళల పట్ల పాత పురుషాధిక్య వైఖరిని ప్రదర్శిస్తోందని బిజెపి అధికార ప్రతినిధి సుభాష్ అన్నారు. టీఆర్ఎస్లో కింది స్థాయి నుంచి పార్టీ స్థాయికి ఎదిగిన మహిళా నాయకురాళ్ళు ఎవరూ లేరని , మహిళల పట్ల టిఆర్ఎస్ కు ఉన్న వివక్షకు ఇది నిదర్శనమన్నారు. ఒకవేళ టిఆర్ఎస్ పార్టీలో ఎవరైనా మహిళా నాయకులు ఎదిగితే అది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలోనేనని, ఇక వారు కూడా స్కాములు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే నాయకురాళ్ళుగా ఉంటారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో సీఎం కేసీఆర్ కుమార్తె కవితను టార్గెట్ చేశారు.

మహిళలను అవమానించటం టీఆర్ఎస్ దురహంకారానికి నిదర్శనం
రాజ్యాంగాన్ని పరిరక్షించే అత్యున్నత పదవిలో ఉన్న గవర్నర్కు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కనీసం జెండా ఎగరవేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదని, కేసీఆర్కు తన దేశం పట్ల విధేయత చూపడం రాదని, మహిళ గవర్నర్ తమిళిసై తో స్నేహపూర్వకంగా వ్యవహరించడం తెలియదని అసహనం వ్యక్తం చేశారు. మహిళలను అగౌరవపరచడం టీఆర్ఎస్ పార్టీ దురహంకారాన్ని తెలియజేస్తోందని మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో మహిళలలో అభద్రతాభావం కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించటం రాకపోగా, బీజేపీని టార్గెట్ చెయ్యటం టీఆర్ఎస్ నాయకుల నీచ రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications