బీజేపీలో జనసేనతో పొత్తు చిచ్చు - వాట్ నెక్స్ట్...!!
తెలంగాణలో ఎన్నికల రాజకీయం మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ - జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కానీ, సీట్ల పైన చర్చలు మాత్ర ఖరారు కాలేదు. పవన్ కల్యాన్ ప్రస్తుతం వరుణ్ తేజ్ వివాహం కోసం ఇటలీకి వెళ్లారు. జనసేన అడుగుతున్న సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్దంగా లేదు. జనసేన పట్టు పడుతున్న సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు అంగీకరించటం లేదు. దీంతో, జనసేనతో పొత్తు వ్యవహారం కొత్త చిచ్చుకు కారణమవుతోంది.
సీట్లు ..ఫీట్లు : జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. జనసేన తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేయాలని తొలుత నిర్ణయించింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి ,లక్ష్మణ్ మద్దతు కోసం నేరుగా జనసేనాని పవన్ తో చర్చలు చేసారు. బీజేపీ అధినాయకత్వంతో చర్చల తరువాత నిర్ణయం తీసుకుందామని పవన్ ప్రతిపాదించారు. ఢిల్లీలో పవన్ నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో బీజేపీ - జనసేన కలిసి ఎన్నికల్లో పని చేయాలని అమిత్ షా నిర్దేశించారు. సీట్ల గురించి కలిసి నిర్ణయానికి రావాలని సూచించారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.

బీజేపీ నేతల పట్టు : తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. కానీ, బీజేపీ మాత్రం 6 సీట్లు ఇచ్చేందుకు సిద్దం అవుతోందని తెలుస్తోంది. దీంతో, చర్చలు ముందుకు కదలటం లేదు. అటు బీజేపీ మూడో జాబితా పైన కసరత్తు జరుగుతోంది. ఇందులో గ్రేటర్ పరిధిలోని సీట్ల పైన పరిశీలన జరుగుతుండటంతో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తారంటూ బీజేపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ కూడా ఎన్నికల బరిలో లేకపోవటంతో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాల కోసం జనసేన పట్టుపడుతోంది. కానీ, బీజేపీ స్థానిక నాయకత్వం మాత్రం ససేమిరా అంటోందని తెలుస్తోంది.
జనసేనకు దక్కేనా : జనసేనకు సీట్లు కేటాయిస్తారేమోననే ప్రచారం నేపథ్యంలో శేరిలింగంపల్లి, కూకట్పల్లి బీజేపీ నేతలు వేర్వేరుగా సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి టికెట్ను రవికుమార్ యాదవ్కు ఇవ్వాల్సిందేనని కొండా విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి సీటు రవికుమార్ యాదవ్ కోసం కొండా పట్టుపడుతున్నారు. కూకట్పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను మేడ్చల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలా..జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు బీజేపీ నాయకత్వానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు జనసేనతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications