నేడు బీజేపీ కీలకనేతల సమావేశం; మోడీ పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చ!!
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి రెండు విడతలుగా వెళ్లిన బిజెపి మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తుంది. ఇక ఇదే సమయంలో రాష్ట్రానికి బిజెపి అగ్రనేతలను ఆహ్వానిస్తూ ముందుకు వెళుతుంది. ఈనెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదులో పర్యటన నేపథ్యంలో, అలాగే పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే క్రమంలో సోమవారం నాడు బీజేపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించనుంది.
తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ ఎనిమిది సంవత్సరాల పాలన పై దేశవ్యాప్త కార్యక్రమాలు నిర్వహించాలని, ఇక రాష్ట్రంలోనూ చేయవలసిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు.
ఈనెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్లో జరగనున్న ఆయన పర్యటనపై కూడా చర్చించనున్నారు. మోడీ రాకకు బీజేపీ నేతలు చేస్తున్న భారీ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. మోడీ పర్యటనతో బీజేపీకి ఏ విధంగా మైలేజ్ తీసుకురావాలి అన్న దానిపైన కూడా నేతలు చర్చించనున్నారు.
ఇప్పటివరకు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిన తీరుపై చర్చించి, మూడవ విడత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ బూతుల ను బలోపేతం చేయడంపై, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టవలసిన కార్యక్రమాలపై, బీజేపీ లో చేరికలతోపాటు, నియోజకవర్గాల పర్యటనలో బిజెపి గుర్తిస్తున్న అనేక సమస్యలపై, ప్రజాక్షేత్రంలో బలంగా వెళ్ళటానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు.