టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు- హాజరు కాకపోతే అరెస్ట్..!!
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు శాసన సభ్యుల కొనుగోలు కేసు దర్యాప్తు.. ఇక ముమ్మరం కాబోతోంది. దీనితో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తోన్న భారతీయ జనత పార్టీ సీనియర్ నాయకులు ఇక ఒక్కొక్కరుగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ కేసును విచారించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన టీమ్ ఇది. ఇవ్వాళ్టి నుంచి విచారణను మొదలు పెట్టనుంది.
టీఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ శాసన సభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిలను పార్టీ ఫిరాయించేలా ప్రలోభ పెట్టటానికి ప్రయత్నించినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న బీజేపీ నాయకులకు సీవీ ఆనంద్ సారథ్యంలోని సిట్.. ఇప్పటికే నోటీసులను జారీ చేసింది. నోటీసులను అందుకున్న వారిలో కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు.
ఇవ్వాళ ఆయన సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో గల సిట్ కార్యాలయానికి రావాల్సి ఉంది. దర్యాప్తునకు హాజరుకాకపోతే 41 ఏ (3), (4) సెక్షన్ల కింద అరెస్టు చేసే అధికారం తమకు ఉంటుందని కూడా సిట్.. ఆయనకు అందజేసిన నోటీస్లో స్పష్టం చేసింది. ఈ విచారణకు బీఎల్ సంతోష్ హాజరవుతారనేది అనుమానమే. ఇవ్వాళ ఆయన హైదరాబాద్కు రాకపోవచ్చని తెలుస్తోంది.
మంగళవారం బీఎల్ సంతోష్ హైదరాబాద్కు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి బీఎల్ సంతోష్ రేపు నగరానికి వస్తారని స్పష్టం చేస్తోన్నాయి. పార్టీ వర్గాలు ఇస్తోన్న సమాచారాన్ని బట్టి చూస్తోంటే.. బీఎల్ సంతోష్ సిట్ విచారణకు గైర్హాజర్ కావడానికే అధిక అవకాశాలు కనిపిస్తోన్నాయి. రేపు నగరానికి రానున్న ఆయనను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారా? లేదా? అనేది ఉత్కంఠత రేపుతోంది.