బీజేపీ మిషన్ తెలంగాణా... కేసీఆర్ సర్కార్ అష్టదిగ్బంధనం; బహుముఖ వ్యూహంతో బండి సంజయ్ సేన!!
తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేస్తున్న బీజేపీ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కూడగట్టడం కోసం, వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం మిషన్ తెలంగాణను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని వైపుల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అష్ట దిగ్బంధనం చేయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది.

గ్రామాలపై ఫోకస్ చేస్తున్న బీజేపీ .. బహుముఖ వ్యూహంతో ముందుకు
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మద్దతును కూడగట్టడానికి తెలంగాణ బీజేపీ బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన ఆ పార్టీ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ కార్యాచరణను ముమ్మరం చేయాలని ప్లాన్ చేసింది. రెండు దశల పాదయాత్రను పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 2న మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి యాత్ర జెండా ఊపి, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనల్గొండ, భువనగిరి మరియు వరంగల్ పరిధిలో 20 రోజుల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. హనుమకొండలోని భద్రకాళి ఆలయం వద్ద యాత్ర ముగించనున్నారు.

బైక్ ర్యాలీలు, కరపత్రాల పంపిణీతో పాటు సంతకాల సేకరణ
ఇక ఇదే సమయంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు పాదయాత్ర ఒక్కటే సరిపోదని పార్టీ అగ్రనేతలు భావించి బైక్ ర్యాలీలు నిర్వహించాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని, రైతుల వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు పలు మార్గాలను సూచించారు.

పల్లె గోస బీజేపీ భరోసా .. గ్రామాలే టార్గెట్
వాటిలో ఒకటి జూలై 21 నుంచి నాలుగు దశల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'పల్లె గోసా బీజేపీ భరోసా' బైక్ ర్యాలీలను చేపట్టడం. ఇందులో భాగంగా తెలంగాణలోని ప్రతి గ్రామానికి చేరుకోవాలనేది బిజెపి ఆలోచన. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించే అన్ని గ్రామాల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. ర్యాలీల సందర్భంగా ప్రతి ఇంటికి ఎన్డీయే విజయాలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చెయ్యాలని కూడా బిజెపి నిర్ణయించింది.

ఇక కేంద్ర మంత్రుల పర్యటనల హోరు..
ప్రతిరోజూ 6 నుండి 8 గ్రామాల మీదుగా దాదాపు 100 మంది పార్టీ కార్యకర్తలు, ఒక నాయకుడి నేతృత్వంలో ర్యాలీ చేయడానికి పక్కా ప్లాన్ చేసింది. ఇదిలావుండగా, లోక్సభ ప్రవాస్ యోజన కింద వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో బహిరంగ సభలు మరియు ఇతర కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ యోచిస్తోంది.
కేంద్ర మంత్రులను రంగంలోకి దించి మూడు రోజుల పాటు తెలంగాణలోని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేసేలా ప్లాన్ చేసింది. అంతేకాదు అన్ని పంట రుణాలను మాఫీ చేయాలని, పీఎంఎఫ్బీవై అమలుకు ఒత్తిడి తేవాలని బీజేపీ కిసాన్ మోర్చా శనివారం నుంచి తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రైతుల సంతకాల ప్రచారాన్ని నిర్వహించనుంది. వివిధ కార్యక్రమాలతో టీఆర్ఎస్ ను అష్ట దిగ్బంధనం చేసే పనిలో ఉంది బీజేపీ.












Click it and Unblock the Notifications