ఫిబ్రవరి 10నుండి తెలంగాణా వీధుల్లో బీజేపీ జజ్జనకరి జనారే!!
ఫిబ్రవరి 10నుంచి బీజేపీ భారీ ప్లాన్తో ముందుకు వెళ్లనుంది. హైకమాండ్ టార్గెట్ ఫిక్స్ చేసి పార్టీని గ్రౌండ్ లెవల్ లో బలోపేతం చేయాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన, బూత్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి సారిస్తుంది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నివేదికలు తెప్పించుకొని, ఆయా నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం చేయడానికి ఏం చేయాలో రాష్ట్ర నాయకులకు దిశనిర్దేశం చేశారు.

ప్రజా క్షేత్రంలోకి బలంగా వెళ్ళటం కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్
రాష్ట్రంలో ప్రజల్లో బిజెపి పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి, బిజెపి పార్టీ గుర్తు కమలం పువ్వును ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకువెళ్లడానికి మాస్టర్ ప్లాన్లను రూపొందించి ఇప్పటికే వాటిని అమలు చేయాలని రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో బిజెపి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అధిష్టానం ఆదేశాల మేరకు బలంగానే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే పార్టీని బూత్ లెవెల్ లో విస్తరించడం పైన బీజేపీ కసరత్తులను ముమ్మరం చేసింది.

బూట్ లెవల్ పార్టీ బలోపేతంపై కసరత్తు
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఇన్చార్జిల నియామక ప్రక్రియను పూర్తి చేసి, ప్రజల మద్దతుని కూడ కట్టే పని మొదలుపెట్టాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ముందుకు వెళుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు వ్యూహాత్మకంగా పని మొదలుపెట్టారు. రాష్ట్రంలో పార్టీని బూత్ లెవెల్ లో బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు ఏప్రిల్ 6 తేదీని డెడ్లైన్ గా పెట్టుకున్నారు. ఏప్రిల్ ఆరవ తేదీన బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా బిజెపిని బలంగా చూపించే ప్రయత్నంలో భాగంగా బూత్ లెవెల్లో ప్రస్తుతం పార్టీ నాయకులు పనిచేస్తున్నారు.

ఫిబ్రవరి 10 నుండి వీధుల్లో బీజేపీ రచ్చ
ఇక ఇవి మాత్రమే కాకుండా ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లడం కోసం, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి ప్రజలు సంపూర్ణ మద్దతుతో తెలంగాణలో అధికారం చేపట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్న బిజెపి, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఫిబ్రవరి నెలలో 15 రోజులపాటు తొమ్మిది వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే మొదట ఫిబ్రవరి నెలలో ఐదవ తేదీ నుండి 20వ తేదీ వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించాలని భావించినప్పటికీ, మళ్లీ తేదీ మార్చి ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించడానికి నిర్ణయించారు బీజేపీ నాయకులు.

ప్రతిరోజు టార్గెట్ 600.. ప్రజాక్షేత్రంలో హంగామా
ప్రతిరోజు 600 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించి ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువయ్యేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వీధుల్లో రచ్చ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో మద్దతు కోసం, బిజెపి బూత్ లెవెల్ లో పార్టీని బలోపేతం చేయడం కోసం బిజెపి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది. బిజెపి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు, ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తాయి అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా వచ్చే ఎన్నికలు లక్ష్యంగా బిజెపి మిషన్ తెలంగాణలో భాగంగా, బండి సంజయ్ సారథ్యంలోని బిజెపి నాయకులు ఉత్సాహంగా, దూకుడుగా ముందుకు వెళుతున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం బీజేపీ జజ్జనకరి జనారే మొదలుపెడుతుంది.












Click it and Unblock the Notifications