బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై దాడి: టీఆర్ఎస్ నేతల పనేనంటూ బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగడం కలకలం రేపింది.
నెల్లికుదురులో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన ప్రేమేందర్ రెడ్డి, హుస్సేన్ నాయక్పై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాత్రంతా డబ్బులు పంచినా మేధావులు లొంగలేదని టీఆర్ఎస్ నేతలు తెలుసుకున్నారని అన్నారు.
ఎన్నికల రోజు కూడా ఓటుకు రూ. 10వేలు పంచుతుంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని.. ఓటమి భయంతోనే బీజేపీ నేతలపై టీఆర్ఎస్ దాడులకు దిగుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. తాము ప్రతిదాడులకు దిగితే టీఆర్ఎస్ ఎదుర్కోలేదని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలన్నారు. ప్రేమేందర్ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సమక్షంలోనే తమ వాళ్లపై దాడి జరిగిందన్నారు.
కాగా, తెలంగాణలో రెండు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. రెండు స్థానాల్లోనూ దాదాపు 50 శాతం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవడం గమనార్హం. ఎక్కువసేపు లైన్లో నిల్చుకోవాల్సి రావడంతో కొందరు ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. ఎండలు మండిపోతున్నా.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీసం టెంట్లు కూడా వేయలేదని ఓటర్లు వాపోయారు.