అలాంటివారు రాజీనామా చెయ్యండి; తెలంగాణా బీజేపీనేతలకు జాతీయనేత బీఎల్ సంతోష్ సీరియస్ వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ పార్టీని బలోపేతం చేయడంపై, క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరుపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రానికి వచ్చిన బిజెపి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి యల్ సంతోష్ బిజెపి రాష్ట్ర ముఖ్య నాయకులకు, జిల్లా అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. సీరియస్ గా పని చెయ్యకుంటే పదవులకు రాజీనామా చెయ్యాలని సూచించారు. బీజేపీ తెలంగాణా నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్ వదిలి సొంత ప్రాంతాలలో పని చెయ్యండి: బీఎల్ సంతోష్
రాష్ట్ర నాయకులు తక్షణం హైదరాబాద్ వదిలి తమ సొంత ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆయన సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు జిల్లాలో ఉంటూ పనిచేయాల్సి ఉంటుందని, ఎవరైతే జిల్లాలలో ఉండడం లేదో వారు తక్షణం రాజీనామా చేయాలని ఆయన పేర్కొన్నారు. త్వరలో బిజెపిలోకి భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్న ఆయన మేం నలుగురమే ఉంటాం, వేరే వారిని సహించేది లేదు అంటే కుదరదని తేల్చి చెప్పారు. పాత,కొత్త అన్న భేదం లేకుండా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీఎల్ సంతోష్ రాష్ట్ర ముఖ్య నాయకులకు వెల్లడించారు.

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అందరూ కృషి చెయ్యాలి
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇంచార్జ్ లు, జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణను సంతోష్ నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించి తదనుగుణంగా క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత కు సీఎం కేసీఆర్ కారణమని బి ఎల్ సంతోష్ పేర్కొన్నారు.

తెలంగాణా సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తున్న కేసీఆర్ ప్లాన్స్ తిప్పికొట్టాలి
కెసిఆర్ ప్రధాన బలహీనత అహంకారం అని పేర్కొన్న సంతోష్, అటువంటి అహంకారం పార్టీ నేతలకు ఉండకూడదని సూచించారు. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టి లబ్ధి పొందాలని టిఆర్ఎస్ పార్టీ చూస్తోందని, దానిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని బి ఎల్ సంతోష్ పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర నాయకత్వం ఇచ్చే కార్యక్రమాలకే పరిమితం కాకుండా, స్థానిక సమస్యల పైన కూడా పోరాటం చేయాలని, గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్
బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని వెల్లడించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని పేర్కొన్నారు. పార్టీలో నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అందరి లక్ష్యం ఒకటేనని, వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయకేతనం ఎగురవేసేలా కీలక భూమిక పోషించాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications