బండి సంజయ్ పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టులో బీజేపీ పిటిషన్; కొనసాగుతున్న ఉత్కంఠ!!
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ లు పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరీంనగర్ లో ఆయన ఇంటివద్ద గృహ నిర్బంధంలో ఉన్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రను విరమించుకోవాలని పోలీసులు బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు. బండి సంజయ్ పాదయాత్ర వల్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో పోలీసుల నోటీసులపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసిన బీజేపీ
బండి సంజయ్ పాదాయత్రతో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో పాదయాత్రను నిలిపివేయాలని పేర్కొన్న పోలీసులు, ఒకవేళ కాదని పాదయాత్రను కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. దీంతో బండి సంజయ్ పాదయాత్రను కొనసాగించటం కోసం అనుమతి కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు బిజెపి నేతలు. పోలీసులు జారీ చేసిన పాదయాత్ర నిలుపుదల నోటీసులను కోర్టులో సవాల్ చేశారు.

అత్యవసర విచారణ జరపాలని కోరిన బీజేపీ, కోర్టు అనుమతి
బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఎట్టి పరిస్థితులలోనూ నిలుపుదల చేసేది లేదని తేల్చి చెప్పిన తెలంగాణ బీజేపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసి అత్యవసరంగా విచారణ జరపాలని కోరగా హైకోర్టు పిటిషన్ ను విచారించేందుకు అంగీకరించింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు అంగీకరించింది. దీంతో హైకోర్టు లో బండి సంజయ్ పాదయాత్ర కు సంబంధించిన పిటిషన్ విచారణ జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ చోటుచేసుకుంది.

పాదయాత్ర కొనసాగిస్తాం .. వరంగల్ లో సభ జరిపి తీరుతాం: బండి సంజయ్
ఇప్పటికే తన పాదయాత్రను అడ్డుకోవడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో పోలీసుల పై విరుచుకు పడుతున్నారు. ఎక్కడ పాదయాత్రను అడ్డుకున్నారో మళ్లీ అక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తాను అని, పాదయాత్రను ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఈనెల 27వ తేదీన వరంగల్ లో బహిరంగ సభ జరిపి తీరుతామని బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్ళనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

పాదయాత్రను కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు బీజేపీ నేతల విజ్ఞప్తి
మరోవైపు ఢిల్లీ తరహాలోనే తెలంగాణలోనూ త్వరలో లిక్కర్ స్కామ్ బయటపడుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు పాదయాత్రను అడ్డుకోవడంపై బిజెపి నేతలు గవర్నర్ తమిళిసై ని కలిసి, పాదయాత్రను కొనసాగించడానికి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నుండి ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే బండి సంజయ్ పాదయాత్ర లో టిఆర్ఎస్ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని, బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు..












Click it and Unblock the Notifications