టిడిపికి బిజెపి షాక్: స్వంతంగా బలపడేందుకు యూపీ ఫార్మూలా
హైద్రాబాద్: 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బిజెపి ప్రణాళికలను సిద్దం చేస్దోంది. ఇటీవలనే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే యూపీ తరహా ఫార్మూలాను తెలంగాణలో కూడ అమలు చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రణాళికలను సిద్దం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అనుకూల రాజకీయపరిస్థితులు ఉన్నప్పటికీ పార్టీ రాష్ట్ర నాయకత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదనే అభిప్రాయంతో జాతీయ నాయకత్వం ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి తన బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బలోపేతం కావాలనేది బిజెపి వ్యూహంగా కన్పిస్తోంది.ఈ మేరకు తొలుత తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ ప్రణాళికలను సిద్దం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది.అయితే తెలంగాణలోని ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బిజెపి నాయకత్వం చర్యలను చేపట్టింది.
బిజెపి కార్యకర్తలకు లక్కీ బైక్ లు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ మూడేళ్ళుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది. మరో వైపు యూపీ ఫార్మూలాను అనుసరించడం వల్ల తెలంగాణలో కూడ పార్టీని బలోపేతం చేయాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు పార్టీకి పూర్తికాలంపాటు పనిచేసే కార్యకర్తలకు ఇప్పటికే శిక్షణలను ప్రారంభించింది. మరో వైపు పూర్తికాలంపాటు పనిచేసే కార్యకర్తలకు బైక్ లను పంపిణీ చేయనుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ బైక్ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చాయి.ఈ నెల 29వ, తేదిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ కార్యకర్తలకు ఈ బైక్ లను పంపిణీ చేయనున్నారు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు 120 బైక్ లను తెలంగాణ రాష్ట్రానికి పంపారు.
బూత్ స్థాయి నుండి ఓటర్లను ఆకర్షించేందుకు శిక్షణ
ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని బిజెపి నాయకత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు మూడు, ఆరు, తొమ్మిది మాసాల పాటు ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సుమారు 85 పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.పార్టీ నిర్మాణంలో భాగంగా వచ్చే రెండేళ్ళపాటు పూర్తిస్థాయిలో పనిచేసే కార్యకర్తలను ఎంపిక చేస్తున్న రాష్ట్ర నాయకులు, నియోజకవర్గానికి ఒకరిని పూర్తిస్థాయిలో సేవలందించే విధంగా శిక్షణ ఇస్తున్నారు.అయితే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఉత్తర్ ప్రదేశ్ నుండి వచ్చిన మోటార్ బైక్ లను పంపిణీ చేయనున్నారు.ఈ నెల 29 నుండి వచ్చే నెల 12వరకు బిజెపి నాయకులు ప్రతి గ్రామంలో పర్యటించనున్నారు.అంతేకాదు ఒక గ్రామంలో ముఖ్యనాయకులు ఒకరోజు బస చేయనున్నారు.
ఇతర పార్టీలకు చెందిన నేతలకు బిజెపి వల
ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకుగాను బిజెపి నాయకత్వం చర్యలను చేపట్టింది.ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులతో బిజెపి నాయకత్వం చర్చలను ప్రారంభించింది. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకులతో ఆ పార్టీ చర్చలను చేస్తోంది. బిజెపిలో చేరితే వారు కోరుకొన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలతో పాటు ఆయా నాయకుల బలాన్ని బట్టి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను కేటాయించనున్నారు.
టిడిపితో పొత్తుపై సందేహాలు
అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ బిజెపితో టిడిపికి పొత్తు ఉంటుందా అనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలు బిజెపి, టిడిపి ల మధ్య దూరం పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉంది.అయితే అప్పటివరకు ఇంకా సమయం ఉంది.అయితే అప్పటివరకు అనేక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు లేకపోలేదు.అయితే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటికిప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.