బండి సంజయ్ రిమాండ్: బీజేపీ 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు; యాక్షన్ ప్లాన్ ఇదే!!
317 జీవోను సవరించాలంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షతో తెలంగాణలో మొదలైన రగడ బండి సంజయ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించే దాకా వెళ్ళింది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడమే కాకుండా, ఆయనపై 10 కేసులు పెట్టి రిమాండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు రానున్న పద్నాలుగు రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

బండి సంజయ్ రిమాండ్ కు వ్యతిరేకంగా 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు
తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తెలిపిన వివరాల ప్రకారం.. బండి సంజయ్ రిమాండ్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించిందని పేర్కొన్నారు . మంగళవారం మండల, జిల్లా కేంద్రాలతో పాటు నగరంలోని పార్టీ కార్యాలయం సమీపంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని తమ నిరసనను తెలియజేస్తారు. మంగళవారం నాడు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో బిజెపి ముఖ్య నేతలు పాల్గొననున్నారు.

బండి సంజయ్ ను విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
బండి సంజయ్ కు రిమాండ్ విధించిన 14 రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పలువురు పాల్గొననున్నారు. తెలంగాణా ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కెయ్యాలన్న చందంగా టీఆర్ఎస్ సర్కార్ తీరు ఉందని వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా విధి విధానాలు పాటించకుండా, వారే తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై తప్పుడు కేసులు బనాయించారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం 317 జీవోను సవరించాలన్న డిమాండ్ తో జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ను విడుదల చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ 14 రోజుల పాటు రాష్ట్రంలో నిరసనలు హోరెత్తనున్నాయి.

కోవిడ్ నిబంధనలు పాటించని టీఆర్ఎస్ నేతలు పోలీసులకు కనిపించటం లేదా? కిషన్ రెడ్డి
తెలంగాణ సీఎం కెసిఆర్ తో సహా టిఆర్ఎస్ నేతలు కరోనా నిబంధనలను పాటించడం లేదని పోలీసులకు కనిపించడం లేదా అంటూ తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనల మేరకే బండి సంజయ్ దీక్ష చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ దీక్ష చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం 317 జీవోను తీసుకురావడం తొందరపాటు చర్య కాదా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ కు ఒక చట్టం ఇతరులకు మరొక చట్టం అంటూ దుయ్యబట్టారు.

నల్గొండ మంత్రుల పర్యటనలో మాస్కులు పెట్టుకోకున్నా పట్టింపు లేదా ?
బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంత్రుల నల్గొండ పర్యటనలో ఎవరు మాస్కు పెట్టుకోలేదని, కేటీఆర్ కరోనా నిబంధనలు పాటించకున్నా అది పోలీసులకు కనిపించదని, మాస్కులు కూడా పట్టుకోకుండా తిరిగినా టిఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ మాస్కు పెట్టుకోవటం ఎప్పుడూ చూడలేదు అన్న కిషన్ రెడ్డి, కెసిఆర్ కు నిబంధనలు వర్తించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications