టార్గెట్ తెలంగాణా అంటున్న కమల దళం .. క్రియాశీల సభ్యత్వంతో కమలదళపతి వ్యూహం
Recommended Video
ఇప్పుడు కమలదళం టార్గెట్ తెలంగాణ అంటోంది. తెలంగాణ రాష్ట్రం పై దృష్టిసారించిన కమలనాథులు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చెక్ పెట్టే పార్టీగా బిజెపి ఆవిర్భవించాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న బిజెపి మరింత పుంజుకోవాలని చూస్తుంది. అందుకే బీజేపీ అధినాయకత్వం ప్రయత్నం చేస్తే తెలంగాణలో పట్టు సాధించవచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం కమల దళపతి రంగంలోకి దిగుతుండటం ఇటు టీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతోంది.
ప్రతిపక్ష పార్టీలు ఎంత అరిచిన మేము పట్టించుకోము : కేటీఆర్
తెలంగాణలో క్రియాశీల సభ్యత్వం తీసుకోనున్న అమిత్ షా .. పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యం
స్వరాష్ట్రమైన గుజరాత్లో సాధారణ సభ్యత్వం కలిగిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో మాత్రం క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సభ్యత్వం రావాలంటే కనీసం 50 మందిని పార్టీలో చేర్పించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పార్టీ క్షేత్ర స్థాయి నుండి బలంగా ఉంటుందో, అప్పుడు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి వీలుగా ఉంటుందని బిజెపి భావిస్తోంది. అందుకే దీనికోసం స్వయంగా రంగంలోకి దిగనున్న కమల దళపతి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 16వ తేదీన కానీ 17వ తేదీన కానీ తెలంగాణకు రానున్న అమిత్ షా స్వయంగా ఇంటింటికీ వెళ్లి 50 మందిని పార్టీలోకి చేర్పించాలని నిర్ణయించారు.
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అమిత్ షా.
సభ్యత్వ నమోదుపై దృష్టి .. టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్న కమల దళం
బీజేపీ ఇందుకోసం సభ్యత్వాలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే 18 లక్షల సభ్యత్వం ఉంది. అయితే బిజెపి మాత్రం 30 లక్షల సభ్యత్వం మొదటి లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఉన్న 18 లక్షలకు మరో 12 లక్షలు చేర్చి 30 లక్షలకు చేర్చాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది సరిపోదని భావించి కనీసం మరో 18 లక్షల మందిని చేర్చాలని బీజేపీ రాష్ట్రనాయకులకు అమిత్ షా సూచించారు.
ఈ సందర్భంగా తాను తెలంగాణ నుంచి క్రియాశీల సభ్యత్వం తీసుకోబోతున్నట్టు తెలిపారు. ఆ సభ్యత్వం కావాలంటే అమిత్ షా ఇంటింటికీ వెళ్లి 50 మందిని పార్టీలో చేర్పించాల్సి ఉంటుంది. అనంతరం వంద రూపాయలు చెల్లించి క్రియాశీల సభ్యత్వం తీసుకుంటారు.
తెలంగాణా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్న అమిత్ షా
ఇక ఈ తరుణంలో రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఏదో ఒక జిల్లాలో షా పర్యటించనున్నారు. క్రియాశీల సభ్యత్వం తీసుకుని తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. బిజెపి జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలను బీజేపీ అధినాయకత్వంపై విశ్వాసం ఏర్పడుతుందని అది పార్టీని బలోపేతం చేయడానికి పనికి వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ బిజెపి తెలంగాణ లో వేస్తున్న ఎత్తుగడలు, ఏకంగా అమిత్ షా అనే రంగంలోకి దిగి రచిస్తున్న వ్యూహాలు ముందు ముందు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజలలోనూ వ్యక్తమవుతోంది.