బాబు కష్టాన్ని అనుభవిస్తున్న కెటిఆర్!: టిడిపి, లక్షకోట్లపై తెరాసకు కిషన్ షాక్
హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన తండ్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ను అడిగి తెలుసుకోవాలని టిడిపి అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శుక్రవారం అన్నారు.
చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లు టిడిపి హయాంలో చేసిన ఫలాలను అనుభవిస్తూ కెటిఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. టిడిపి ప్రభుత్వం సైబరాబాదును ఏర్పాటు చేసిందనే విషయాన్ని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరిచిపోయినా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని ఎద్దేవా చేశారు.
కెటిఆర్ నిర్వహించే పారిశ్రామిక సదస్సు, అంతర్జాతీయ ఐటీ సదస్సులు అన్నీ టిడిపి చంద్రబాబు కట్టిన హైటెక్ సిటీలోనే అనే విషయం మరిచారా అని నిలదీశారు. దమ్ముంటే హైదరాబాద్ అభివృద్ధి పైన చర్చకు రావాలన్నారు.
కెటిఆర్ లక్ష కోట్లపై కిషన్ రెడ్డి షాక్!
బిజెపి నేతలు కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు తెచ్చిన తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో మాట్లాడే హక్కు ఉందని మంత్రి కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మంత్రి కెటిఆర్ రూ.లక్ష కోట్లు తేవాలని చెబుతున్నారని, కేంద్రం తెలంగాణకు ఇప్పటికి లక్ష కోట్ల కంటే ఎక్కువే ఇచ్చిందని చెప్పారు. మేం లెక్కలు చూపిస్తే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం మానేస్తారా అని సవాల్ విసిరారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రం సాయం లేకుండానే సంక్షేమ పథకాలు చేపడుతున్నారా అని నిలదీశారు.