బీజేపి-టీఆర్ఎస్ చీకటి ఒప్పందం బహిర్గతం అవుతుంది.!బండి సంజయ్ పై జగ్గారెడ్డి ఫైర్.!
హైదరాబాద్ : బీజేపి పార్టీపైన, బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండి పడ్డారు. రామాయంపేట తల్లి కొడుకు మరణాలకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ ని మంత్రివర్గం నుండి తొలగించేవరకు బీజేపీ పోరాడుతుందా.?పోరాడదా.?అని జగ్గా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. బాదితుల పక్షాన బీజేపి ఉద్యమం చేపట్టకపోతే వారి మద్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమవుతుందని తెలిపారు. బీజేపీ బాదిత కుటుంబానికి సాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేసారు.
మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేయాలి..
రామాయంపేట ఆత్మహత్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆత్మహత్యలకు కారణమైన మంత్రిని బర్తరఫ్ చేసే వరకు బీజేపీ పోరాటం చేయకపోతే బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయన్న అంశం తేటతెల్లం అవుతుందని తెలిపారు. ఆత్మహత్యల పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించకపోతే ఆ రెండు పార్టీలు పరస్పర అవగాహనతో రాజకీయాలు నడుపుతున్నాయన్న అంశం ప్రపంచానికి తెలిసి పోతుందని జగ్గారెడ్డి తెలిపారు.
నేరాలు..ఘోరాల రాష్ట్రంగా తెలంగాణ..
మరణ వాంగ్మూలం తీసుకోవాలని నిబంధన ఉంన్నప్పటికి అధికారులు ఎందుకు తీసుకోలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు స్పందించడం లేదని నిలదీసారు. ప్రభుత్వం ఇవాళ దోషిగా నిలబడిందని, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల మోజులో ఉందని, పోలీసులు ప్రజలను చంపుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. రామాయణం పేట లో మున్సిపల్ చైర్మన్ వేదింపులు ఇద్దరు వ్యక్తులను ఆత్మహత్యకు ప్రేరేపించాయని, రామాయణం పేటలో టీఆర్ఎస్ నాయకులు అంతా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఇద్దరి ప్రాణాలు పోయాయని, తెలంగాణ నేరాలు..ఘోరాల రాష్ట్రం గా మారిపోయిందని అన్నారు.
టీఆర్ఎస్ నేతల విచ్చలవిడి దందాలు..
అంతే కాకుండా రామాయణం పేట పోలీసులకు సిగ్గు అనిపించడం లేదా..? అని జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. పోలీసులు వారి యూనీఫాంకు విలువ ఇవ్వనప్పుడు విధుల నుండి వైదొలగాలని అన్నారు. సీఎం మౌనంగా ఉండటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ నాయకుల వేధింపులతో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా సీరియస్ గా చర్యలు తీసుకోవాలి సీఎంకు జగ్గారెడ్డి సూచించారు. సీఎం చంద్రశేఖర్ రావు ఖమ్మంలో మంత్రి వేధింపులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు 25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు.
పది లక్షల ఆర్ధిక సాయం చేయండి
ఇదిలా ఉండగా సీఎం చంద్రశేఖర్ రావును జైల్లో పెడతా అని మాటలు చెప్పడం కాదని, తమరి పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మౌనంగా ఉన్నావని బండి సంజయ్ ని జగ్గారెడ్డి నిలదీసారు. మంత్రి మీద కేసులు పెట్టీ..బర్తరఫ్ చేసే వరకు బీజేపీ ఉద్యమం చేయాలన్నారు. లేదంటే గులాబీ, బీజేపీ మద్య దోస్తీ ఉందని నిరూపించబడుతుందని అన్నారు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త కుటుంబంకి బండి సంజయ్ 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, బండి సంజయ్ కు చేతకాక పోతే, కాంగ్రెస్ పార్టీ బాదిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తుందన్నారు జగ్గారెడ్డి.