రాజాసింగ్ విడుదలకు బీజేపీ యత్నం; బీజేపీ వల్లే దేశంలో మత విద్వేషం: అసదుద్దీన్ ఓవైసీ
మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై భారతీయ జనతాపార్టీ సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. ఆయనపై పోలీసులు పిడి యాక్ట్ కూడా నమోదు చేసి జైలుకు పంపించారు. అయితే బిజెపి నుండి ఎమ్మెల్యే రాజా సింగ్ సస్పెన్షన్ ఒక నాటకమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడం కోసం బిజెపి నాటకం ఆడుతోందని ఆయన ఆరోపించారు. రాజాసింగ్ కు బీజేపీ మద్దతు కొనసాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా
ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని ఆరోపించిన అసదుద్దీన్ ఓవైసీ, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు దూరంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఆయన విడుదలకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండటం వల్లే రాజాసింగ్ ను కటకటాల వెనక్కి నెట్టారని ఓవైసీ స్పష్టం చేశారు.
రాజా సింగ్ ను విడిపించటం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు
మహమ్మద్ ప్రవక్త పై దుర్భాషలాడిన సస్పెండ్ కాబడిన జాతీయ అధికార ప్రతినిధి కూడా ఢిల్లీలో బిజెపి నియంత్రణలో ఉన్న పోలీసులు కాకపోతే, ఖచ్చితంగా కటకటాల వెనక ఉండేవారని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం నూపూర్ శర్మను అరెస్ట్ చేయడానికి బదులు ఆమెకు భద్రత కల్పిస్తుందని ఓవైసీ ఆరోపించారు. జైల్లో ఉన్న రాజా సింగ్ ను విడిపించడానికి బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తోందని మండిపడిన అసదుద్దీన్ ఓవైసీ బిజెపి మత రాజకీయాలు చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్ణాటకలో గణేష్ చతుర్ధికి మాంసాహారం నిషేధంపై మండిపడిన ఓవైసీ
కర్ణాటకలో గణేష్ చతుర్ధి సందర్భంగా మాంసాహారం పై నిషేధం విధించటం ఏమిటని ఓవైసీ మండిపడ్డారు. బెంగళూరులో మాంసాహారాన్ని నిషేధించడం ద్వారా ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు నాన్ వెజ్ తింటారు అని పేర్కొన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
మాంసం విక్రయించేవారిలో అత్యధికులు ముస్లిం లే.. అందుకే నిషేధం
హోటళ్లలో యథేచ్ఛగా నాన్వెజ్ దొరుకుతుంటే, పేదల కోసం నాన్వెజ్ షాపులు తెరిస్తే మాత్రం అభ్యంతరం చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హక్కులు అణచివేతకు గురవుతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక మాంసం విక్రయించే వారిలో అత్యధిక శాతం ముస్లిం వర్గానికి చెందినవారే ఉండటంతో వారిపైన అక్కసుతో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉన్నారని అసదుద్దీన్ ఓవైసీ అనుమానం వ్యక్తం చేశారు.
మొరాదాబాద్ లో నమాజ్ చెయ్యకుండా ఆంక్షలా?
మొరాదాబాద్ లో ముస్లింలు నమాజ్ చేయకుండా నిలిపివేయడంపై కూడా ఓవైసీ మండిపడ్డారు. నమాజ్ చేయడానికి కూడా అనుమతి తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు . ఇది ముస్లింల పట్ల ద్వేషాన్ని స్పష్టం చేస్తోందని ఓవైసీ పేర్కొన్నారు. బిజెపి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, ముస్లింలను అణిచివేసేందుకు అన్ని చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.