సాలు దొర.. సెలవు దొర.. రగడ: రంగంలోకి పోలీసులు; బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్.. తగ్గేదేలే!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బిజెపి ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. తాజాగా టిఆర్ఎస్ బిజెపిల మధ్య డిజిటల్ బోర్డు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని బిజెపి "సాలు దొర.. సెలవు దొర" పేరుతో బిజెపి కార్యాలయం వద్ద ఒక డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసింది. అంతేకాదు ఒ వెబ్ సైట్ ప్రారంభించి మరీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తుంది. అయితే బీజేపీ డిజిటల్ బోర్డుపై టిఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం కాస్త ఇరు పార్టీల మధ్య ఘర్షణకు కారణంగా మారింది.
బీజేపీ కార్యాలయం వద్దకు పోలీసులు .. డిజిటల్ బోర్డు రగడ
బిజెపి ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు ను తొలగించాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఆఫీస్ దగ్గర పెట్టిన "సాలు దొర.. సెలవు దొర" బోర్డులు తీసేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. లేదంటే మోడీ బోర్డులు తెలంగాణవ్యాప్తంగా పెట్టి చెప్పుల దండలు వేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో బిజెపి కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన డిజిటల్ బోర్డు రగడ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో బిజెపి కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఈ డిజిటల్ బోర్డు ను తొలగించాలని బిజెపి కార్యాలయ సిబ్బంది పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
తగ్గేదే లేదంటున్న బండి సంజయ్.. బోర్డు తీసేది లేదని స్పష్టం
అయితే బిజెపి నాయకులు మాత్రం తమ కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకు అంటూ మండిపడుతున్నారు. డిజిటల్ బోర్డును తొలగించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎవరికీ భయపడేది లేదని, తగ్గేదే లేదని తేల్చి చెబుతున్నారు. కెసిఆర్ పాలనకు చరమ గీతం పలకడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెబుతున్నారు.
సాలుదొర.. సెలవు దొర వెబ్ సైట్ .. రిజిస్టర్ అవ్వాలని పిలుపు
కల్వకుంట్ల కౌంట్ డౌన్ పేరుతో "సాలు దొర సెలవు దొర" అంటూ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా బిజెపి ఏకంగా ఒక వెబ్ సైట్ ను కూడా రూపొందించి టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది. కెసిఆర్ పాలనకు స్వస్తి పలకడానికి వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి అంటూ పేర్లు, ఫోన్ నెంబర్లు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను బిజెపి సేకరిస్తుంది. అంతేకాదు ఈ వెబ్ సైట్ లో వివరాలు సమర్పించిన వారి రియల్ టైమ్ సంఖ్యను కూడా సూచిస్తుంది.
కేసీఆర్ వైఫల్యాలు ఎత్తిచూపుతున్న బీజేపీ... సోషల్ మీడియాలోనూ రచ్చ
అలాగే తాజా సమాచారం పేరుతో కెసిఆర్ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం కూడా ఈ వెబ్సైట్ ద్వారా బిజెపి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను స్క్రోలింగ్ రూపంలో ఈ వెబ్సైట్ ద్వారా బిజెపి ప్రచారం చేస్తుంది. ఇదే సమయంలో సెలవు దొర పేరుతో బిజెపి కొత్త ట్విట్టర్ ఖాతాను తెరిచింది. ఇక తాజాగా బీజేపీ చర్యలతో గులాబీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.