కేసీఆర్, టీఆర్ఎస్ను ప్రజలు నమ్మరు, అహంకారానికి ఓటమే: కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి ఫైర్
హైదరాబాద్: మునుగోడులో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీదే విజయం: కిషన్ రెడ్డి
మునుగోడులోఆదివారం జరగనున్న బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఆదివారం బీజేపీలో చేరనున్నారని ఆయన తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్ అవుతుందని స్పష్టం చేశారు.
మునుగోడులోనూ హుజూరాబాద్ ఫలితాలే రిపీట్: కిషన్ రెడ్డి
బీజేపీ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ అని, అందుకే పార్టీలో చేరే వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని సూచించిందన్నారు. మాజీ మంత్రి ఈటల సైతం తన పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు కిషన్రెడ్డి. మునుగోడులో రేపు అమిత్షా సభ ఉంటే.. ఇవాళ కేసీఆర్ సభ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ ఆ 3 నియోజకవర్గాలే కనిపిస్తాయంటూ కిషన్ రెడ్డి ఫైర్
ప్రజలను మభ్య పెట్టడం టీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో కేవలం 3 నియోజకవర్గాలే కనిపిస్తాయన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ వెళ్లే రోడ్లు, హైటెక్ సిటీ తప్ప ఆయనకు ఇంకోటి కనిపించదని మండిపడ్డారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ అహంకారానికి పరాజయమే: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నిక ఆత్మ గౌరవానికి, అహంకారానికి యుద్ధమని అన్నారు. తప్పు చేసిన వ్యక్తి మళ్లీ ప్రజల ముందుకు వస్తారా? అని నిలదీశారు. రైతుబంధు, రైతు బీమా అని చెప్పుకోవడం తప్ప ప్రజలకు వేరే చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలంతా మునుగోడువైపే చూస్తున్నారన్నారు. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని తేల్చిచెప్పారు.