గోషామహల్ గుడుంబాకింగ్ రాజాసింగ్.. దమ్ముంటే ఆ పని చెయ్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ సవాల్
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్ అంటూ ఆరోపణలు గుప్పించారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. దమ్ముంటే వచ్చే ఎన్నికలలో తనపై పోటీ చేయాలని అప్పుడే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రాజా సింగ్ కు లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై రాజాసింగ్ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.
మతాల పేరుతో బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు: బోధన్ ఎమ్మెల్యే షకీల్
కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మతాల పేరుతో కుట్రలు చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. యువకులను మతాల పేరుతో రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ షకీల్ మండిపడ్డారు. దళిత బంధు పథకంపై కుట్రలు చేస్తూ బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలి అని షకీల్ పేర్కొన్నారు. తాను దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై జిఎస్టి విధించిన ఘనత బిజెపిదే
బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు 2500 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రపంచంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై జిఎస్టి విధించిన ఘనత బిజెపిదేనని ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. ఇక ఇదే సమయంలో ఎంపీ అరవింద్ ను సైతం టార్గెట్ చేశారు బోధన్ ఎమ్మెల్యే. ఎంపీ అరవింద్ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి కోసం పది పైసలు ఖర్చు పెట్టినట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటూ సవాల్ విసిరారు. బోధన్ నియోజకవర్గంలో ఏ గ్రామం ఎక్కడుందో కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ కు తెలియదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే షకీల్ ను టార్గెట్ చేస్తూ రాజా సింగ్ సంచలన ఆరోపణలు
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిజామాబాద్ అడ్డాగా మారిందని పేర్కొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బోధన్ లో రోహింగ్యాల కు ఎమ్మెల్యే షకీల్ పాస్ పోర్టులు ఇప్పించారని నిప్పులు చెరిగారు. కేరళలో బ్యాన్ చేసిన సిమి ఆర్గనైజేషన్, నిజామాబాద్ లో పిఎఫ్ఐగా వెలిసిందని, హిందువులపై దాడి చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు. నిఘా వైఫల్యంతోనే ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారు.
ప్రజా గోస.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీలలో రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అక్రమ దందాలకు పాల్పడుతున్నారని, ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ కు పాలన చేత కావడం లేదన్న రాజాసింగ్, సీఎం కుర్చీలో కూర్చునే అర్హత కెసిఆర్ కు లేదంటూ విమర్శించారు. తాజాగా బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలలో పర్యటిస్తున్న క్రమంలో రాజా సింగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చెయ్యగా ఇది నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేడికి కారణం అయ్యింది.