'సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై భగ్గుమన్న వైశ్యులు: ఎవరినీ విమర్శించలేదన్న ఐలయ్య..
ఐలయ్య పుస్తకాన్ని తక్షణం నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు-కొమటోళ్లు' అనే పుస్తకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో ఉత్పత్తి కులాలకు తగిన గౌరవం దక్కలేదని వాదించే ఐలయ్య.. ఇక్కడి కులాల మధ్య వైషమ్యాలను వారి వారి స్థితి గతులను తన రచనల ద్వారా తెలియజేస్తున్నారు.
ఇందులో భాగంగానే మాలల తత్వం, మాదిగల తత్వం పేర్లతో పుస్తకాలు వెలువరించిన ఆయన.. అదే బాటలో వైశ్య సామాజికవర్గంపై 'సామాజిక స్మగ్లర్లు' అంటూ పుస్తకాన్ని వెలువరించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఈ పుస్తకంపై వైశ్యులు భగ్గుమంటున్నారు. ఐలయ్య పుస్తకాన్ని తక్షణం నిషేధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఐలయ్య దిష్టిబొమ్మ దగ్డం:
కంచ ఐలయ్య వెలువరించిన పుస్తకం ఆర్యవైశ్యుల మనోభావాలని కించపరిచి, వారి ప్రతిష్టని దెబ్బతీసేలా ఉందని ఆ సామాజిక వర్గం ఆరోపిస్తోంది. పుస్తకాన్ని నిషేధించడంతో పాటు రచయిత, పబ్లిషర్స్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనలకి దిగిన ఆర్యవైశ్యులు.. ఐలయ్య దిష్టిబొమ్మలు దగ్డం చేశారు. ఒక సామాజిక వర్గాన్ని విమర్శించే నీకెవరిచ్చారని ఆర్య వైశ్యులు ఐలయ్యను నిలదీస్తున్నారు. భావ ప్రకటనా స్వేచ్చకు అర్థం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.

ఐలయ్య ఏమన్నారు?:
భారతదేశంలో కులాల సంస్కృతిని వివరించే సందర్భంగా ఈ పుస్తకం రాశానని, అంతే తప్ప ఎవరినో విమర్శించడానికి కాదని ఐలయ్య అన్నారు. ఎవరినో విమర్శించాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. తెలంగాణలో కోమటోళ్లను కోమట్లనే అంటారని, అందుకే పుస్తకంలోను అదే పదం వాడానని చెప్పారు. ఇంగ్లీషు వెర్షన్ పుస్తకంలో బనియా పదం వాడినట్లు తెలిపారు.

ఆర్యవైశ్యులు అందులో భాగం కావాలి:
హిందు ధర్మ శాస్త్రాల గురించి ప్రస్తావిస్తూ.. గ్రామాల్లో వ్యాపారం కోమట్లు మాత్రమే చేయాలన్న నిబంధనను తీసుకొచ్చారని ఐలయ్య తెలిపారు. ఈ విధానం వల్ల గ్రామీణ వ్యాపార వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. దేశంలో అంటరానితనం పెచ్చరిల్లడంలో వారు కూడా భాగమేనని పేర్కొన్నారు.
తనకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను అరికట్టడంలో ఆర్యవైశ్యులు భాగం కావాలని ఆయన సూచించారు. గ్రామీణ వ్యాపారంలో దళితులు, ఇతర సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

జిలుకర శ్రీనివాస్ (బహుజన రచయిత):
వేల యేళ్లుగా వ్యాపారం పేరు మీద మీరు చేసిందీ, చేస్తున్నదీ స్మగ్లింగ్ కాకపోతే ఏందో చెప్పండి. ఆ పుస్తకం లో మీ గురించి మంచి మాటలు కూడా చెప్పిండు. మీరు గుప్త రాజులనీ, పాలకులుగా వున్న కాలం ఒకటుందనీ, ముఖ్యంగా జైనమతాన్ని వ్యాపింప చేసినవాళ్లనీ చెప్పాడు.
హిందూమతం పేరుతో మిమ్ముల బ్రాహ్మణులు వాడుకొంటున్నారని మీకు సుద్దులు చెప్పాడు. పైగా ముందుమాటలో మీరు ఈ దేశాన్ని రక్షించే సైనికులు కావాలని పిలుపునిచ్చాడు. ఆయన ఇంగ్లీష్ లో రాసినవి మీరు చదవరు. చదివినా నోట్లకట్టలు, బంగారం గుట్టలు అర్థం అయినంతగా సామాజికశాస్త్ర విషయాలు అర్థం కావాయె. మేముఈ జ్ఞాన పరిమితులను అర్థం చేసుకుంటాం.
కానీ తెలుగులో రాసిన పుస్తకాలు కూడా మీరు చదువరాయె. డబ్బులుంటేనే ఏం సుఖం. జ్ఞానం అంతకన్న ఎక్కువ సుఖాన్ని సంతోషాన్నిస్తదని బుద్ధుడు, బాబాసాహెబ్ చెప్పిన సంగతి ఇప్పుడన్నా తెలుసుకోండి.












Click it and Unblock the Notifications