'బట్టీ' మాఫియా..: ఇసుక మాఫియాను మించి.. బయటపడని చీకటి కోణాలెన్నో!
కరీంనగర్: బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడి నుంచో వచ్చి కరీంనగర్ ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. వెట్టి చాకిరీ చేయించుకునే యజమానుల ఆగడాలకు విలవిల్లాడిపోతున్నారు.
కనీస వేతనం అన్న మాటే ఎరుగని ఆ కూలీల జీవితాలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో గడిచిపోతున్నాయి. ఇటుక బట్టీ వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు యజమానుల ఆగడాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు.

అసలేం జరుగుతోంది:
కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 500 ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటిల్లో 15వేల మంది కార్మికుల వరకు పనిచేస్తున్నారు. వీళ్లలో ఎక్కువమంది ఒడిశా, ఛత్తీస్ఘడ్,మహారాష్ట్రల నుంచి వలస వచ్చినవాళ్లే. ఇక్కడ ఇటుకబట్టీలు నడుపుతున్నవారు కూడా స్థానికేతరులే కావడం గమనార్హం.
ఏళ్ల క్రితం కరీంనగర్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డ కొంతమంది ఈ వ్యాపారంలో దిగారు. వేరే రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకుంటున్న ఇటుకబట్టి యజమానులు.. వారితో బానిసల్లా పనిచేయించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూలీలతో వెట్టి చాకిరీ:
ఒక్కసారి ఇక్కడ పనికి కుదిరే కూలీలు.. తిరిగి బయటపడటం కష్టమని చెబుతున్నారు. ఒకవేళ అలాంటి సాహసమే చేస్తే.. యజమానులు వారిని తీవ్రంగా వేధిస్తారని అంటున్నారు.
చాలీ చాలని వేతనాలిచ్చి.. కనీస కార్మిక చట్టాలు కూడా వర్తింప చేయకుండా వారితో పనిచేయించుకుంటున్నారు. కేవలం తిండి పెడితే చాలు ఇక్కడే పడి ఉంటారు అన్న రీతిలో వారి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.

మహిళలపై లైంగిక వేధింపులు:
ఇక కూలీకి వచ్చే మహిళలపై యజమానులు లైంగిక వేధింపులకు కూడా పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఓ గర్భిణీ మహిళను తన్నిన కేసు అప్పట్లో వివాదాస్పదమవగా.. ఎలాగోలా దాన్ని తెరమరుగు చేశారు.
పలువురు ఒడిశా మహిళలపై అత్యాచారాలు కూడా జరిగాయన్న ఆరోపణలున్నాయి. అలాగే అమాయక మహిళలను గర్భవతులను చేసి.. వారికి బలవంతంగా అబార్షన్స్ చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

బట్టీల్లో బాలకార్మికులు:
కూలీ కోసం వచ్చిన పేద దంపతుల పిల్లలతోనూ ఇటుక బట్టీల్లో పనిచేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల స్థానిక అధికారులు తనిఖీలకు వెళ్లిన సందర్బంలో.. వారందరిని ఓ ట్రాక్టరులో ఎక్కించి బట్టీ యజమానులు ఎక్కడో దాచేశారని చెబుతున్నారు.
ఎవరైనా చూస్తే స్కూలుకు వెళ్లే పిల్లలు అనుకోవాలనే ఉద్దేశంతో.. మామూలు రోజుల్లో వారికి స్కూల్ యూనిఫామ్ వేయించి ఉంచుతారని, కానీ స్కూలుకు మాత్రం పంపించరని చెబుతున్నారు. మొత్తంగా బాల కార్మిక చట్టాలకు కూడా వీరు తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు చాలానే వినిపిస్తున్నాయి.

అధికారులకు పట్టదా?:
కరీంనగర్ ఇటుకబట్టీల నుంచి మూడు రాష్ట్రాలకు ఇటుకలు సరఫరా అవుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి కూడా ఇక్కడినుంచే ఇటుకలు వెళ్తున్నాయి. ఇక్కడి ఇటుకలకు ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు అధికారులు సైతం బట్టీ యజమానులతో కుమ్మక్కై... వారి అక్రమాలను చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

అంతా సవ్యంగానే.. : బట్టీ యజమానులు..
కిందిస్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు పలువురికి ఈ బట్టీ యజమానులతో లింకులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అందుకే వీరి ఆగడాలు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎవరైనా నోరు తెరిస్తే.. బట్టీ యజమానులే సెటిల్మెంట్ చేసేస్తున్నారని అంటున్నారు.
బట్టీ యజమానులు మాత్రం కూలీలను తాము చాలా బాగా చూసుకుంటున్నామని చెబుతున్నారు. ఇక్కడ పనిచేసే కూలీలకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటున్నామని, తమపై ఎటువంటి ఆరోపణలు లేవని అంటున్నారు.


Click it and Unblock the Notifications