కాళ్ళ పారాణి ఆరకముందే .. వధువు మృతి, రోడ్డు ప్రమాదాలతో పెళ్లింట మోగుతున్న చావుడప్పులు !!
ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో పెను విషాదం చోటు చేసుకుంటున్న సంఘటనలు నిత్యం పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల్లో పెళ్లి జరగనుంది అనగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మామిడి తోరణాలతో కళకళలాడుతూ ఉండాల్సిన ఇళ్ళు, మరణ మృదంగం మోగిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఐదు రోజుల్లో పెళ్లి ఉండగా,శుభలేఖలు పంచడానికి వెళ్ళిన వాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్న వధువు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది.
అర్థాంతరంగా ముగిసిపోయిన వధువు జీవితం
జీవితం మీద ఎన్నో ఆశలతో, ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని, కొత్త జీవితంలో కాలు పెట్టాలనుకున్న ఓ వధువు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని కబళించింది. ఆమె కలలన్నీ చెరిపేసింది. నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ రోడ్డు ప్రమాద ఘటనలో వధువు ప్రాణాలు కోల్పోగా, వధూవరుల కుటుంబాలలో పెను విషాదం మిగిలింది. నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో పాండవ పూర్ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది. ఈ ప్రమాద ఘటనలో నూతనంగా పెళ్లి చేసుకున్న 25 సంవత్సరాల వధువు మౌనిక, ఆమె తండ్రి రాజయ్య అక్కడికక్కడే మరణించారు.

పెళ్లి జరిగి మూడు రోజులైనా కాక ముందే రోడ్డు ప్రమాదంలో వధువు , ఆమె తండ్రి మృతి
పెండ్లి కొడుకుతో పాటు కార్ డ్రైవర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
ఈనెల 25వ తేదీన మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో కడెం మండలం పాత మద్ది పడగకు చెందిన రాజయ్య అనే వ్యక్తి తన కుమార్తెకు వివాహం జరిపించాడు. ఎంతో ఘనంగా పెళ్లి చేసి, అత్తగారింటి వద్ద రిసెప్షన్ కూడా నిర్వహించిన తర్వాత, తిరిగి కుమార్తెతో పాటు అల్లుడిని తన ఇంటికి తీసుకు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నవవధువు, ఆమె తండ్రి రాజయ్య మృతి చెందగా వధువు కుటుంబంతో పాటు,వరుడి కుటుంబం కూడా కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వరుడు జనార్ధన్, డ్రైవర్ రణధీర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వరుడు, డ్రైవర్ పరిస్థితి సీరియస్ .. కన్నీరు మున్నీరుగా ఇరు కుటుంబాలు
మరణించిన మౌనిక, ఆమె తండ్రి రాజయ్య మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన నూతన వరుడు జనార్ధన్, డ్రైవర్ రణధీర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఇంకొక ఘటనలో వివాహం కోసం బ్యాండ్ బృందాన్ని నిర్వహిస్తున్న యువకుడు అదే బ్యాండ్ కారణంగా మృత్యువాత పడ్డాడు. కారణాలు ఏమైనా పెళ్ళిళ్ళు కళ తప్పుతున్నాయి. బాజా భజంత్రీలు మోగించాల్సిన ఇళ్ళు, పలువురి మరణాల కారణంగా చావు డబ్బులను మోగిస్తున్నాయి.
Recommended Video
విధి ఆడుతున్న వింత నాటకం ..పెళ్ళిళ్ళలో మిగులుతున్న విషాదం
అప్పటి వరకూ సంతోషంగా ఉన్న కుటుంబాల్లో ఊహించని విషాదం నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా జీవితాన్ని రాసుకుందాం అనుకున్న దంపతులకు పెళ్లి మరణశాసనం రాస్తుంది. శుభ కార్డులు ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు కొందరు, పెళ్లి షాపింగ్ లకు వెళ్ళిన వారు మరికొందరు, పెళ్లి పీటల మీద ఇంకొందరు, పెళ్లి జరిగిన తర్వాత అనంతలోకాలకు పయనమవుతున్నవారు కొందరు కుటుంబాలను శోకంలో ముంచి విధి ఆడిన వింత ఆటలో పావులవుతున్నారు.












Click it and Unblock the Notifications