40ఏళ్ళ వ్యక్తిని పెళ్ళాడింది.. నగదు,నగలతో ఉడాయించింది; షాకింగ్ స్కెచ్ అమలు చేసిందిలా!!
కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుక్కి, నవవధువు ఊహించని షాక్ ఇచ్చింది. అత్తారింటికి వచ్చిన నవవధువు ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదుతో ఉడాయించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీలో ఓ కిలాడీ లేడీ చేసిన ఈ పని అటు పెళ్ళికొడుకునే కాదు, ఈ విషయం తెలిసిన వారందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. ఇక అసలు విషయానికి వస్తే

విజయవాడ వెళ్లి మరీ అమ్మాయి సెలెక్షన్
పెళ్లి చేసుకోమని బంధువులు ఎంతగా పోరు పెట్టినా, చూసిన ప్రతి సంబంధానికి ఏదో వంక పెట్టి తనకు పెళ్లి వద్దని 40 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్రహ్మచారి కథ అతని పెళ్ళితో మలుపు తిరిగింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని గట్టిగా సంకల్పించిన అతను ఓ స్నేహితుడు సహాయంతో మధ్యవర్తిని కలిసి తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక బలంగా ఉందని,ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే సంబంధం చూడమని కోరాడు. తనకు లక్ష రూపాయలు ఇస్తే మంచి సంబంధాన్ని కుదురుస్తా అని అతను చెప్పడంతో ఆ మొత్తాన్ని కూడా సదరు బ్రహ్మచారి చెల్లించాడు. ఇక సంబంధం చూసిన మధ్యవర్తి అమ్మాయిని చూడడానికి విజయవాడ తీసుకెళ్లాడు.

వరుడితో నగలు, బట్టలు షాపింగ్; ఇంటికి వెళ్ళాక ఊహించని షాక్
విజయవాడలో ఓ అమ్మాయిని చూసిన సదరు బ్రహ్మచారి గురువారం రోజు ఓ లాడ్జిలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు భార్యతో కలిసి యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేసుకున్నాడు. ఆపై హైదరాబాద్ కి వెళ్లి షాపింగ్ చేశారు. మూడు తులాల బంగారు గొలుసును, 40 వేల రూపాయల బట్టలను కొనుగోలు చేసి ఇక స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే బీరువాలో బట్టలు సర్దుతున్నట్లు నటించిన కొత్త పెళ్లి కూతురు, బీరువాలో ఉన్న రెండు లక్షల రూపాయలు నగదు, కొత్తబట్టలు అన్నింటిని జాగ్రత్తగా తన బ్యాగ్ లో సర్దుకుంది. పెళ్లి కూతురుతో పాటు వచ్చిన ఒక యువతి అక్కడ తన చుట్టాలు ఎవరో ఉన్నారని, వారింటికి వెళ్లి వస్తాను అంటూ ఒక క్యాబ్ ను బుక్ చేసింది.

టాబ్లెట్ కోసం పంపించి క్యాబ్ లో ఉడాయించిన నవ వధువు
అప్పటివరకు సర్దుతున్నకొత్త పెళ్లి కూతురు తనకు తలనొప్పిగా ఉందని టాబ్లెట్ తీసుకురావాలని భర్తను బయటకు పంపించింది. అతను టాబ్లెట్ల కోసం వెళ్లగానే, మెరుపు వేగంతో నగానట్రా సర్దేసి తనతోపాటు ఉన్న యువతితో కలిసి క్యాబ్ లో ఉడాయించింది. ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఇంట్లో కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య, ఆమెతో పాటు వచ్చిన బంధువు ఎవరూ లేకపోవడంతో ఒక్క సారిగా ఖంగు తిన్నాడు. ఆమె బ్యాగ్ , బీరువాలో డబ్బులు, నగలూ లేకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. దీంతో సోమవారం రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్యాబ్ లోనే బట్టలు మార్చేసి చెక్కేసిన మాయ లేడీలు
ఇదిలా ఉంటే కారులో వెళ్లిన నవ వధువు, ఆమెతో పాటు ఉన్న యువతి అనుమానాస్పద ప్రవర్తన చూసిన కారు డ్రైవర్ ఇంజాపూర్ సమీపంలో, కారులోనే వాళ్లు డ్రస్సులు మార్చుకోవడం చూసి షాక్ కు గురయ్యాడు. ఇదేమిటని ప్రశ్నించాడు. దీంతో వారు అతన్ని బెదిరించి ఎల్బీనగర్ వద్ద కారు దిగి అక్కడి నుంచి ఉడాయించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా అన్నేళ్ల పాటు ఎదురుచూసి ఏరికోరి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఇంత పని చేస్తుందని ఊహించని పెళ్ళికొడుకు లబోదిబోమంటున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారమే మోసం చేసినట్టు పోలీసుల అనుమానం
ఇక లక్ష రూపాయలు తీసుకొని మరీ తనకు పెళ్లి సంబంధం చూసిన మధ్యవర్తిని నిలదీశాడు. దీంతో ఆ మధ్యవర్తి ఆమె ఇంత పని చేస్తుందని ఊహించలేదని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. 40 ఏళ్ల బ్రహ్మచారిని పెళ్లి చేసుకుని, భార్యగా వచ్చి ఇల్లు దోచుకెళ్లి మోసం చేసిన సదరు కిలాడీ లేడిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications