జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. భూతగాదాలతో తండ్రి, ఇద్దరు కుమారుల దారుణ హత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో భూ వివాదాలకు ముగ్గురు బలైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గంగారం గ్రామంలో పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య గత కొంత కాలంగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య పొలం విషయంలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో మరోమారు పొలం విషయంలో తేల్చుకుందాం రమ్మని ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం కోసం పొలం వద్ద సమావేశమయ్యాయి. మాట్లాడుతున్న క్రమంలో మాట మాట పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారుణంగా గొడ్డలితో నరికి హతమార్చారు. ఈ ఘర్షణలో ముగ్గురు మరణించారు.

మంజా నాయక్ ఆయన పెద్ద కుమారుడు సారయ్య, చిన్న కుమారుడు భాస్కర్ లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నిందితుడు మాంకాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లుగా సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం భూపాలపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు.












Click it and Unblock the Notifications