తెలంగాణ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీకి భారీగా కోత: మైనారిటీలకు పీట: రంజాన్కు రూ.33 కోట్లు
Telangana Budget 2024: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-2025 వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించిన కేటాయింపులు.. క్రమంగా వివాదాస్పదమౌతోన్నాయి. ప్రత్యేకించి- సంక్షేమ పథకాలకు నిధులను కేటాయింపు విషయంలో వివక్ష చూపిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. గురువారం ఈ బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్ మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు. మూల ధన వ్యయం మొత్తాన్ని 33,487 కోట్ల రూపాయలుగా తేల్చింది.

కాగా- ఈ బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేటాయింపులను భారీగా పెంచింది రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ఏడాది మైనారిటీల సంక్షేమానికి 3,003 కోట్ల రూపాయలను కేటాయించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను గత కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల కంటే ఈ మొత్తం చాలా ఎక్కువ. అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ 2,200 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.
రంజాన్ పండగను నిర్వహించడానికి 33 కోట్ల రూపాయలను కేటాయించింది. అషూర్ ఖానాల మరమ్మతుల కోసం 50 లక్షల రూపాయలు, తబ్లిఘి జమాత్ ఇస్లామియా సమావేశాల కోసం 2.4 కోట్ల రూపాయలు, హజ్ యాత్ర కోసం 4.43 కోట్ల రూపాయలను కేటాయించింది.
అదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా కోత పెట్టింది. ఎస్సీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 21,072 కోట్ల రూపాయలను కేటాయించగా.. రేవంత్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని సగానికి పైగా తగ్గించింది. ఈ బడ్జెట్లో కేటాయించిన మొత్తం 7,638 కోట్ల రూపాయలే.
ఎస్టీల అభివృద్ధికి గత ప్రభుత్వం 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం 4,365 కోట్ల రూపాయలు కాగా.. ఇందులో కూడా కోత పెట్టింది రేవంత్ సర్కార్. ఈ బడ్జెట్లో ఎస్టీ సామాజిక వర్గం కోసం కేటాయించిన మొత్తం 3,969 కోట్ల రూపాయలే.
తెలంగాణలో ముస్లిం జనాభా అధికం. రాష్ట్ర జనాభాలో దాదాపుగా 14 శాతం అంటే 50 లక్షల వరకు ముస్లింలు తెలంగాణలో నివసిస్తోన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారందరూ కూడా కాంగ్రెస్కు ఓటు వేశారని, అందుకే- ఎస్సీ, ఎస్టీల కంటే వారి సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications