కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం: వ్యక్తి అరెస్ట్
మెదక్ : నర్సాపూర్లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది.
కేసీఆర్ సభలో ప్రసంగిస్తుండగా అస్లాం అనే యువకుడు అనుమానాస్పందంగా తిరుగుతుండటంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అస్లాం నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అస్లాంను విచారిస్తున్నారు.

కాంగ్రెస్పై విమర్శలు: నర్సాపూర్పై హామీల వర్షం
రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే వారి కోసం రైతుబంధు, ధరణి, రైతు బీమా వంటి సంక్షేమాలను తీసుకువచ్చామని తెలిపారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే దౌల్తాబాద్ను మున్సిపాలిటీ చేస్తామని అన్నారు.
భూ వివాదాలు ఉండకూడదనే మూడేళ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆశించినంత పరిణతి ఇంకా రాలేదని పేర్కొన్నారు. ఇలా పరిణతి సాధించిన దేశాలు అభివృద్ధిలో ముందుకు సాగాయని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. ప్రజలకు ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని.. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించి వేయాలని కోరారు కేసీఆర్.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని.. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలే ఆలోచించుకోవాలని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి, కరెంటు కష్టాలు ఉండేవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పింఛను రూ.200 ఉండేదని.. దానిని రూ.2000కు పెంచిన ఘనత బీఆర్ఎస్దేనని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిపై పన్ను రద్దు చేశామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కేసీఆర్.












Click it and Unblock the Notifications