సింగరేణిలో పోలింగ్ ప్రారంభం: ఉమ్మడితో కేసీఆర్కు షాకిచ్చేనా?
సింగరేణి కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి.
హైదరాబాద్: సింగరేణి కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయి.
పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటేశారు. గనుల పరిధిలోని ఆరు జిల్లాల్లోని 11 డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కోసం మొత్తం 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 52 వేలమందికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు.
సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఏ ఏరియాలో ఎక్కువ ఓట్లు సాధించిన సంఘాన్ని ఆ ఏరియాకు గుర్తింపు సంఘంగా నిర్ణయిస్తారు. మొత్తంగా అధిక ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు.
గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతాయి. చివరి సారిగా 2012లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం గెలిచింది. తాజా ఎన్నికల్లో బొగ్గు గని కార్మిక సంఘం సహా 15 సంఘాలు బరిలో ఉన్నాయి.
టీబీజీకేఎస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా, ఏఐటీయూసీ, ఎన్ఎన్టీయూసీ, టీఎన్టీయూసీలు కూటమిగా బరిలో నిలిచాయి. ప్రధాన పోటీ ఈ రెంటి మధ్యనే ఉంది. కాగా, ఈసారి ఉమ్మడి కూటమి టిఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్కు షాకివ్వనుందని అంటున్నారు.