దీక్ష చేసినా స్పందించలే.!తర్వాత కార్యాచరణ ఘాటుగా ఉంటుంది.!ప్రభుత్వాన్నిహెచ్చరించిన జగ్గారెడ్డి
హైదరాబాద్ : తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందని, బోర్డు తీరు వల్ల గత రెండేళ్ల క్రితం విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనేక మంది అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని జగ్గారెడ్డి గుర్తు చేసారు. ఈ విద్యాసంవత్సరంలో 4.50 లక్షల మంది ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 2.35 లక్షల మంది ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు.
ఇంటర్ విద్యార్థుల మరణాలు ఆపండి.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జగ్గారెడ్డి ఇంటర్ బోర్డ్ ముందు దీక్ష
చాలా రాష్ట్రాలలో కోవిడ్ కారణంగా ఇంటర్ విద్యార్థులనే కాకుండా అంతకన్నా ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులను పాస్ చేశారని గుర్తు చేసారు. తెలంగాణలో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చలించడం లేదని జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యార్తులను ఎందుకు పాస్ చేయడం లేదని నిలదీసారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రభుత్వ కాలేజ్ లో చదివిన విద్యార్థులేనని అన్నారు. కోవిడ్ కారణంగా ఆన్ లైన్ క్లాస్ లు లేవని, ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదని, ప్రైవేట్ కాలేజ్ లలో ఆన్ లైన్ క్లాస్ లు జరిగాయి కాబట్టి ఆ విద్యార్తులు పాస్ అయ్యారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
పాస్ కాని విద్యార్ధుల ఆత్మహత్యలు.. ప్రభుత్వం మానవత్వంతో పాస్ చేయాలన్న జగ్గారెడ్డి
విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలసత్వం వహిస్తోందని నిలదీసారు. ఎలాంటి సదుపాయాలు ఇవ్వకుండా, ఫెయిల్ అయిన విద్యార్థులను ఎందుకు విఫలం చెందారో కనీసం విశ్లేషణ చేయకపోడం విచారకరమన్నారు జగ్గారెడ్డి. ఫెయిల్ అయిన విద్యార్థులను పట్టించుకకపోతే వారి భవిష్యత్తు అగమ్యగోచరం కాదా.?సీఎం చంద్రశేఖర్ రావు ఈ అంశం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి సూచించారు. ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ప్రతీ రోజు ఇంటర్ పిల్లలు చనిపోతున్నారని, త్వరగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు.
దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించలేదు.. భవిష్యత్ కార్యాచరణ ఘాటుగా ఉంటుందన్న జగ్గారెడ్డి
విద్యార్థులు మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డ్ ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎన్ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బలమురి వెంకట్, నిరసన దీక్ష చేసారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్ గ్రిషియా ఇవ్వాలని, తక్షణమే ఫెయిల్ చేసిన విద్యార్ధులను పాస్ చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు
విద్యాశాఖా మంత్రి అట్టర్ ఫ్లాప్.. విద్యార్ధుల మరణాల పట్ల కనీస స్పందన లేదన్న జగ్గారెడ్డి
అంతే కాకుండా ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తల్లితండ్రులకు కన్నీళ్లు మిగిల్చొద్దని విద్యార్తులకు హితవు పలికారు. ఇక విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్ర రెడ్డి మంత్రి పదవిలో ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటేనని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యార్థులు చనిపోతుంటే మంత్రి పదవిలో ఉండి సబితా ఇంద్రా రెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారని, మా దీక్షకు ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి శుక్రవారం తమ కార్యాచరణ పెద్ద ఎత్తున ప్రకటిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేసారు.