యువకులపై దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి
రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారం వద్ద శుక్రవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నాగారం గ్రామానికి చెందిన శ్రీశైలం, రాఘవేందర్, మరో యువకుడు మార్నింగ్ వాక్కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నాగారం-మనసానిపల్లి రోడ్డు వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి పరారయ్యాడు. కారులు రెండు మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
కారు బీభత్సం: ఇద్దరి మృతి
హైదరాబాద్: కారు బీభత్సం సృష్టించడంతో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.అఫ్జల్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్బజార్కు చెందిన వరుణ్రాజ్(19), నరేందర్(18), కౌశిక్, ప్రకాశ్, శివ, ప్రశాంత్, భాస్కర్, డ్రైవర్ వైష్ణవ్ వీరంతా స్నేహితులు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అఫ్జల్గంజ్ నుంచి మహేంద్ర వెరిటో కారులో కాచిగూడ వెళ్తుండగా మార్గ మధ్యలో విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద కారు అదుపుతప్పి ఓ ప్రార్థనా మందిరాన్ని ఢీకొట్టింది.
ప్రమాదంలో వరుణ్రాజ్, నరేందర్ అక్కడిక్కడే మృతిచెందారు. మిగిలిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం సేవించి వేగంగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.