ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ కన్నుమూత
ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 7వ తేదీన అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు.
హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 7వ తేదీన అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు.
గురువారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఉదయం పది గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లంబ్కు మోహన్ మృతదేహాన్ని తరలించనున్నారు. పొలిటికల్ కార్టూన్లలో మోహన్ ప్రత్యేక శైలిని పరిచయం చేశారు.
మోహన్ ఉదయం, ఆంధ్రప్రభ వంటి పలు పత్రికల్లో పనిచేశారు. పొలిటికల్ కార్టూన్లకు ఆయన పెట్టింది పేరు. ఆయన వ్యక్తి కాదు, ఓ స్కూల్. పలువురు పిల్ల కార్టూనిస్టులకు ఆశ్రయం ఇచ్చి, వారికి ఉపాధి మార్గం చూపించిన ఘనత కూడా ఆయనది.
విశేషమైన సాహిత్య అధ్యయనం ద్వారా ఆయన తన కుంచెకు పదును పెట్టుకుంటూ వచ్చారు. ఆయన వేసిన బొమ్మలకు లెక్క లేదు. ఇది మోహన్ గీత అనే విధంగా తన ప్రత్యేక శైలిని చూపించారు. ఆయనకు దాదాపు 67 ఏళ్లు ఉంటాయి.
మోహన్ పూర్తి పేరు తాడి మోహన్. ఆయన 1951 డిసెంబర్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. 1970లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్ ఎడిటర్గా జర్నలిజంలోకి అడుగు పెట్టారు.