రెచ్చిపోతున్న నయీమ్ అనుచరులు: భూకబ్జాలకు పాల్పడుతున్న 10మందిపై కేసు.. వారిలో పోలీస్ అధికారి కూడా..
గ్యాంగ్ స్టర్ నయీమ్ చనిపోయినప్పటికీ రాష్ట్రంలో నయీమ్ గ్యాంగ్ ఆగడాలు కొనసాగుతున్నాయా ? నయీమ్ ముఠా సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారా? వారికి పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. హన్మకొండలో తాజాగా పోలీసులు నమోదు చేసిన భూకబ్జాల కేసు అందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

భూకబ్జాలకు పాల్పడుతున్న 10మందిపై కేసు .. వారిలో ఓ పోలీస్ అధికారి
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో భూ కబ్జాలకు పాల్పడుతున్న పది మందిపై కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీరిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నయీమ్ కు సంబంధించిన అనుచరులతో పాటు పోలీస్ అధికారి కూడా హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని భూముల కబ్జాకు పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు.

ఇంకా కొనసాగుతున్న నయీమ్ గ్యాంగ్ ఆగడాలు
గ్యాంగ్ స్టర్ నయీమ్.. ఈ పేరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరే. తెలంగాణ రాష్ట్రంలో అనేక అరాచకాలకు పాల్పడిన నయీమ్ ను పోలీసులు పక్కా సమాచారంతో 2016వ సంవత్సరంలో ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నయీమ్ చనిపోయిన తర్వాత అతని చీకటి దందాలకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతనితో పలువురు పోలీస్ ఉన్నతాధికారులకు, రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న చర్చ జరిగింది. అయితే అతను చనిపోయినప్పటికీ అతని అనుచరుల ఆగడాలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

ఆరుగురు అరెస్ట్ .. నలుగురు పరారీ .. పోలీస్ అధికారి కేసులో ఉండటం హాట్ టాపిక్
ఈ క్రమంలోనే నయీమ్ గ్యాంగ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు గా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న పదిమంది పై కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో నలుగురి కోసం వేట మొదలుపెట్టారు. ఇక వీరితో కలిసి భూకబ్జాలకు పాల్పడిన వారిని పోలీస్ అధికారి ఆర్ఐ సంపత్ కుమార్ కూడా ఉండడం పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది.

పరారీలో పోలీస్ అధికారి .. అరెస్ట్ అయిన వారు ఖమ్మం జైలుకు తరలింపు
ఈ కేసులో ఏ1 గా వేణుగోపాల్, ఏ2గా ఆర్ ఐ సంపత్ కుమార్ లను పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఉన్న పోలీస్ అధికారి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన ఆరుగురిని ఖమ్మం జైలుకు తరలించారు అధికారులు. ప్రస్తుతం హనుమకొండలో ఈ కేసు వ్యవహారం దుమారంగా మారింది .












Click it and Unblock the Notifications