ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్నూ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసిబి సోమవారం నాడు నలుగురు టిడిపి అనుబంధ సంస్థ టిఎన్ఎస్ఎఫ్ నాయకులను విచారించింది. ఎసిబి విచారణకు హాజరైనవారిలో ప్రదీప్, సుధీర్, మనోజ్ పుల్లారావు యాదవ్లు ఉన్నారు.
వీరితో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రను కూడా ఎసిబి విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిని ఎసిబి విచారించింది. మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది.
ఓటుకు నోటు కేసులో డబ్బు వ్యవహారం, ఇతర కీలక అంశాల గురించి వీరిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. ఆ తర్వాత వేం డ్రైవర్లు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది.